చిరుపై ఎమ్మెల్యే ఆగ్రహం, పరిటాల సునీత హెచ్చరిక
హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా కొత్త రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కావాలనుకున్న రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవిలకు ప్రజలు బుద్ధి చెప్పడంతో వారు మతిస్థిమితం కోల్పోయారని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మంగళవారం మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కాంగ్రెసు పార్టీ వారికి లేదన్నారు.
పరిటాల సునీత హెచ్చరిక
తమ కుటుంబం పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే అరెస్టు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత వేరుగా హెచ్చరించారు. పరిటాల కుటుంబం ఒకరికి పెట్టేదే తప్పితే.. ఇతరులను ఇబ్బందులకు గురి చేసేది కాదన్నారు. తమ కుటుంబం పైన వచ్చిన వసూళ్ల ఆరోపణలు అవాస్తవమన్నారు.
నవంబరులో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మహస్తం పేరును మారుస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కిరోసిన్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం 98 శాతం పూర్తయిందని చెప్పారు త్వరలో ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లతో దీపం పథకం చేపడతామన్నారు.
డబ్బు పంచడం వల్లే: రఘువీరా రెడ్డి
డబ్బు పంచడం వల్లే నందిగామలో టీడీపీ గెలిచిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఏపీలో తమ బలం పెరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమకు రెండువేల ఓట్లు వస్తే ఇప్పుడు ఇరవై అయిదువేల ఓట్లు వచ్చాయన్నారు.