చంద్రబాబు సమక్షంలోనే..: సోమిరెడ్డికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అకస్మాతుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను నెల్లూరులోని సింహపురి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చాతిలో కొద్దిగా నొప్పి వచ్చింది.
శనివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో పాల్గొన్న సోమిరెడ్డి ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ప్రమాదం ఏమీ లేదని చెప్పారు.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎస్పీఎస్ నెల్లూరు తదితర వర్షం పడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

వరద సహాయక చర్యలపై నెల్లూరులోని ఉమేశ్ చంద్ర టౌన్హాల్లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ మంత్రులు నారాయణ, శిద్దా రాఘవ రావు, పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వర రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బాధితులకు తక్షణసాయం అందించడంపై సమావేశంలో చర్చించారు.
భారీ వర్షాల కారణంగా మృతి చెందిన అయిదు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సీఎం పరిహారం అందజేశారు. చంద్రబాబు మాట్లాడుతూ... వరదల వల్ల రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరినట్లు చెప్పారు. జాతీయ రహదారిపై పడిన గండ్లను పూడ్చి మూడు రోజుల్లో పూర్తిస్థాయి రాకపోకలను పునరుద్ధరిస్తామన్నారు. సర్వేపల్లి రిజర్వాయరు కింది కాల్వల పనుల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications