పెళ్లాడిన తర్వాత భార్యతో అలా ఉండాలంతే...: పవన్ కళ్యాణ్పై నిమ్మల కిష్టప్ప
విశాఖపట్నం/ న్యూఢిల్లీ : పెళ్లాడిన తర్వాత భార్యతో అన్యోన్యంగా ఉండాలి తప్పకొడతానంటే ఎలా? అని అనంతపురం జిల్లా హిందూపురం తెలుగదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెక్షన్ 8తో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని సెక్షన్లు అమలు చేయాలని తాము కోరుతుంటే పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
ఎంపీలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను నిమ్మల తప్పుబట్టారు. రాజ్యాంగాన్ని అనుసరించే చట్టాలు అమలవుతాయి తప్ప పవన్ కల్యాణో, ఇంకొకరో చెప్పినంత మాత్రాన అమలు కావని ఆయన అన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎంపీలపై విమర్శలు చేయకుండా సూచనలుచేసి ఉండాల్సిందన్నారు.

పవన్ వస్తానంటే రాజీనామా చేస్తా
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటే పవన్ కళ్యాణ్ కోసం తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోరాటం చేయాలని సూచించారు. అప్పుడు తాము కూడా వెన్నుదన్నుగా నిలుస్తామని అన్నారు.
పవన్ కల్మశం లేని వ్యక్తి అని, ఎవరో చెప్పిన మాటలు విని ఆయన అలా మాట్లాడారని ఆయన అన్నారు. తాము కూడా పవన్ అభిమానులమేనని ఆయన అన్నారు. ఏమీ ఆశించకుండా టీడీపీ కోసం గత ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాము పని చేస్తున్నామో లేదో తెలవాలంటే టీడీపీ కార్యాలయానికి వచ్చి చూడాలని అన్నారు.












Click it and Unblock the Notifications