రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సొంత కంపెనీలాగా భావిస్తున్నారు: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపాటు
తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే యనమల రామకృష్ణుడు ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే ఇక తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఏపీలో పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ఆర్ధిక పరిస్థితిని సరిదిద్దాలన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించాయి అంటూ పేర్కొన్నారు. ఆదివారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలని పేర్కొన్నారు.

ఏపీలో జగన్ సీఎం అయిన నాటి నుండి విధ్వంసకర పాలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి విధ్వంసకర పాలన కొనసాగుతోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. తాజాగా కాగ్ నివేదిక తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను మరోమారు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని తాము అనేకమార్లు చెప్పామని పేర్కొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇదే విషయాన్ని కాగ్ కూడా చెప్పిందని స్పష్టం చేశారు.

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సొంత కంపెనీ లాగా భావిస్తున్నారు
48 వేల కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వ ఎందుకు ఖర్చు పెట్టింది? ఎలా ఖర్చు పెట్టింది? వివరాలేవీ లేవని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ట్రెజరీ కోడ్ ఉల్లంఘించిందని కాగ్ పేర్కొన్నదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సొంత కంపెనీ లాగా భావిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

ఏపీలో పన్నులతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు
ఏపీలో ఒక నాయకత్వం లేదని, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి విజన్ లేదని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక్క కంపెనీ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎవరైనా ఏపీలో పరిశ్రమలు పెట్టాలని భావిస్తే వారిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. జగన్ హయాంలో రకరకాల పన్నుల పేరుతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఆఖరికి చెత్త పై కూడా పన్ను వేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .












Click it and Unblock the Notifications