నీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలాగే జరిగితే ఏం చేస్తారు: రేపులు చేసే వారికి జగన్ ఆదర్శం: అనిత ఫైర్
అమరావతి: తెలుగు మహిళా అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్బ్యురో సభ్యురాలు వంగలపూడి అనిత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్దారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసేంత హీన స్థితికి ముఖ్యమంత్రి దిగజారిపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయని, శాంతిభద్రతలు కరవయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆకృత్యాలను అడ్డుకోవడంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఆ పని చేయకపోతే రాష్ట్రం తగులబడిపోతుంది: జగన్ సర్కార్కు బీజేపీ నేత వార్నింగ్
Recommended Video
దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు
అమరావతి ప్రాంతంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప జిల్లాలోని లింగాల మండలంలో నాగమ్మ అనే దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడితే ఎవరూ పట్టించుకోలేదని, నాలుగు రోజల తరువాత.. ఆ ఘటన వెలుగులోకి వచ్చిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే..మహిళలపై కొనసాగుతోన్న దారుణాలు బయటకి రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి తాము వెళ్లగా ప్రయత్నించగా.. పోలీసులు తమపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని అన్నారు.
ఆ హక్కు ఎవరిచ్చారు?
పార్టీకి చెందిన దళిత నేతలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే జగన్ గ్యాంగ్కు చిన్న మెదడు చితికిపోయిందో లేక మెదడు జారి మోకాళ్ల కిందికి వచ్చిందో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. `దళిత నేతల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే హక్కు వైఎస్ జగన్కు ఎవరిచ్చారు? మీ తాత రాజారెడ్డా? మీ తండ్రి రాజశేఖర్ రెడ్డా?` అని నిలదీశారు. లేదంటే జగన్ సొంత రాజ్యాంగం ఏదైనా అలాంటి హక్కు కల్పించిందా? అని ప్రశ్నించారు.
రేపులు చేసే వారికి జగన్ ఆదర్శం..
లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి, 16 నెలల పాటు జైలుకు వెళ్లొచ్చిన జగన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని వ్యాఖ్యానించారు. అయిదేళ్ల పాటు ఆయనను భరించక తప్పదని అన్నారు. జైలుకు వెళ్లొచ్చిన జగన్ను దొమ్మీదారులు, డెకాయిట్లు, రేపులు, హత్యలు చేసే వారికి ఆదర్శంగా నిలిచారని చురకలు అంటించారు. మహిళల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్కు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఒక చెల్లి, తల్లి ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
దళిత మహిళ హోమ్ మంత్రిగా ఉన్నా..
మహిళల జోలికి ఎవరు వచ్చి అసభ్యంగా ప్రవర్తించినా తెలుగుు మహిళా విభాగం చూస్తూ ఊరుకోబోదని, వారి తాట తీస్తారని అనిత హెచ్చరించారు. మద్యం, పేకాట క్లబ్లులను స్వయంగా మంత్రులే నిర్వహిస్తున్నారనే విషయం మరోసారి రుజువైందని ఆమె అన్నారు. అలాంటి వారికి వైఎస్ జగన్ నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. హోమ్ మంత్రి దళిత మహిళ అయినప్పటికీ.. ఆమెకు కనీస చట్టాలపై అవగాహన లేదని అన్నారు. దళితులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న తెలుగుదేశం పార్టీ వాటిని అడ్డుకుని తీరుతుందని చెప్పారు.