దేవయాని ఇష్యూ: ఒబామా బొమ్మ దగ్ధం చేసిన టిడిపి
హైదరాబాద్: అమెరికాలో భారత దౌత్యాధికారిణి దేవయాని పట్ల అమెరికా తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళన చేపట్టింది. బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని టిడిపి కార్యకర్తలను ముట్టడించారు. లోనికి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు.
పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దేవయాని వైఖరి పట్ల అమెరికా తక్షణమే భారత్కు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. దేవయానికి న్యాయం చేయాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు. దేవయాని ఇష్యూపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

కాగా, దేవయాని పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర మనస్తాపం చెందిన ప్రధాని మన్మోహన్ సింగ్, ఈ సమస్య విషయంలో ఏ కోణాన్ని వదలొద్దని, పూర్తిస్థాయి పరిష్కారం కనుగొనాలని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్లను ఆదేశించారు. బుధవారం రాత్రి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్కు ఫోన్ చేసి దేవయాని పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేయడం తెలిసిందే.
కెర్రీ తనతో జరిపిన టెలిఫోన్ సంభాషణ వివరాలను తెలియజేయడం కోసం మీనన్ గురువారం ప్రధాని మన్మోహన్ను కలిశారు. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నిన్ననే ఇదే విషయమై మన్మోహన్ను కలిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేవయాని పట్ల అమెరికా ప్రవర్తించిన తీరుపట్ల తీవ్ర మనస్తాపం చెందిన ప్రధాని ఈ వ్యవహారంలో ఏ కోణాన్నీ వదిలిపెట్టకుండా పూర్తిస్థాయి పరిష్కారాన్ని కనుగొనాలని వారిని ఆదేశించారని, అంటే ఆమె జైలునుంచి విడుదల కావడమే కాక ఆమెపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చూడాలన్నదే ప్రధాని ఉద్దేశమని ఆ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications