ఎవరో ఎందుకు- గుడివాడ, గన్నవరంలల్లో చంద్రబాబు, లోకేష్ పోటీ చేయొచ్చుగా..!!
తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శాసన సభ్యుడు వల్లభనేని వంశీ- చంద్రబాబు, నారా లోకేష్ కు సవాల్ విసిరారు. కొడాలి నాని, తనపై పోటీ చేసి గెలవగలరా? అని ప్రశ్నించారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొనసాగుతోందీ యాత్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా జిల్లాకు చెందిన మంత్రులు, ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి లోకల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేపైనా నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తోన్నారు. ఇవి కాస్తా రాజకీయ వేడిని రాజేస్తోన్నాయి.

లోకేష్ కామెంట్స్పై..
పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా, ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వారిపై వ్యక్తిగత దాడికి దిగారు. ప్రత్యేకించి- రోజాను జబర్దస్త్ ఆంటీ అంటూ సంబోధించారు. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీలను ఓడించి తీరుతామంటూ ప్రతిజ్ఞ చేశారు నారా లోకేష్. దీనికోసం ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

ఎంతమంది వచ్చినా..
దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, శాసన సభ్యులు మండిపడుతున్నారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. తాజాగా- ఈ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించారు. తనను, కొడాలి నానిని ఓడించాలంటే చంద్రబాబు ముత్తాత తరం కూడా కాదని తేల్చి చెప్పారు. లోకేష్ నాయుడు, వాళ్ల నాన్న చంద్రబాబు నాయుడు, వాళ్ల నాన్న ఖర్జూరనాయుడు, వాళ్ల నాన్న లవంగం నాయుడు, వాళ్ల నాన్న యాలకుల నాయుడు.. ఇలా ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా తనను, కొడాలి నానిని ఓడించలేరని అన్నారు.

వారిద్దరే రావొచ్చుగా..
ఎవరో ఎందుకు?, గుడివాడ, గన్నవరంలల్లో చంద్రబాబు, నారా లోకేషే తమపై పోటీ చేయొచ్చుగా అంటూ వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. చంద్రబాబు కుప్పం కోటే బీటలు వారిందని, ముందు దాని గురించి పట్టించుకోవాలని వల్లభనేని వంశీ సూచించారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిందని గుర్తు చేశారు.

2024 రిపీట్..
ఇవే ఫలితాలు 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. సీట్లు ఇంకా పెరుగుతాయని అన్నారు. చంద్రబాబు- కుప్పంలో సొంతంగా ఇళ్లు కట్టుకున్నా ప్రయోజనం లేదని, అది ఆల్ రెడీ మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఇక నారా లోకేష్ గురించి మాట్లాడుకోవడం కూడా దండగేనని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా పని చేసినా కూడా 2019 ఎన్నికల్లో గెలవలేకపోయాడని, దీన్ని బట్టి ఆయన స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

నేనూ ఆ స్కూల్ లోనే చదివా..
చంద్రబాబు, నారా లోకేష్ వన్నీ ఉడత ఊపులేనని వల్లభనేని వంశీ చురకలు అంటించారు. తానూ తెలుగుదేశం స్కూల్ లోనే చదువుకున్నానని, వారి గురించి తనకు తెలియదా? అని ప్రశ్నించారు. తమ నియోజకవర్గాలను తాము కాపాడుకుని, మిగిలిన వాళ్ల గురించి మాట్లాడాలని సూచించారు. 2024లో 175కు 175 స్థానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టబోతోన్నారని వల్లభనేని వంశీ అన్నారు.












Click it and Unblock the Notifications