ఆన్ లైన్ టికెట్లపై టీడీపీ, వైసీపీ వార్-సినిమాలు కూడా తీస్తారా అని అశోక్ బాబు ప్రశ్న
ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెట్ల వ్యవహారం అధికార, విపక్షాలైన వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తన బాధ్యతల్ని వదిలిపెట్టి సినిమా టికెట్లు అమ్ముకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సమాచార మంత్రి పేర్నినాని నిన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.

ఏపీలో ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు అమ్మాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన మంత్రి పేర్నినాని.. సినిమా పెద్దలు బ్లాక్ టికెటింగ్ ను అరికట్టాలని కోరినందునే తమ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో బ్లాక్ టికెట్ల అమ్మకాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం తానే టికెట్లు అమ్మాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా ట్వీట్ చేశారు. బ్లాక్ టికెట్లు అరికట్టాలని సినిమా పెద్దలు కోరినందుకే ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్లు అమ్మేందుకు సిద్ధమవుతోందని మంత్రి పేర్నినాని చెప్తున్నారు.. అలాగే పైరసీని అరికట్టాలని కూడా కోరారు కాబట్టి ఇక సినిమాలు కూడా మీరే తీస్తారా అని అశోక్ బాబు ప్రశ్నించారు.

Recommended Video
ఏపీలో ప్రభుత్వం ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మాలన్న నిర్ణయంపై ఇప్పటికే టీడీపీ క్షేత్రస్ధాయిలో ఆందోళనలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిత్యం విమర్శలకు దిగుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేందుకు సిద్ధపడటం లేదు. అంతే కాదు దీన్ని సమర్ధించుకుంటూ ప్రకటనలు కూడా చేస్తోంది. మరోవైపు ఈ నెల 20న సినిమా పరిశ్రమ పెద్దలు మరోసారి సీఎం జగన్ ను కలిసేందుకు అమరావతి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ సాధారణ ప్రజల నుంచి మాత్రం ఈ నిర్ణయంపై విమర్శల జడి తప్పడం లేదు. త్వరలో భారీ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉన్నందున అప్పటికల్లా ప్రభుత్వ నిర్ణయం ప్రభావం అమల్లోకి వస్తుంది. దీంతో ఆలోపే ప్రభుత్వంపై విమర్శలతో ఒత్తిడి పెంచేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications