టీడీపీలోకి కోటంరెడ్డి - కోవర్ట్ ఆపరేషన్..!?
కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లటం ఖాయమైన వేళ ఆ పార్టీ నేత కొత్త సందేహాలు కలిగేలా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేయనని కోటంరెడ్డి తేల్చి చెప్పారు. టీడీపీ నుంచి బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబును నుంచి కోటంరెడ్డి స్పష్టమైన హామీ ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో కోటంరెడ్డి స్థానంలో కొత్త ఇంఛార్జ్ ను నియమించేందుకు వైసీపీ అధినాయకత్వం సిద్దమైంది. కోటంరెడ్డి ప్రభుత్వంలోని ముఖ్యుల పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసారు. దీని పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అదే సమయంలో టీడీపీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ పరిణామాల నేపథ్యంలో చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు అనం - కోటంరెడ్డి ఇద్దరూ వైసీపీలో కొనసాగే అవకాశం కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఆనం తానే బరిలోకి దిగుతారా లేక తన కుమార్తెను పోటీలోకి దించుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో కోటంరెడ్డికి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారని వైసీపీ నేతలే చెబుతున్నారు. కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పైన చర్చ సాగుతున్న వేళ ..టీడీపీ సీనియర్ నేత ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఒక ట్వీట్ చేసారు. అందులో ..వైసిపి కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది. రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా...!..జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు..అంటూ ట్వట్ చేసారు.
వైసిపి కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 2, 2023
రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా...!
జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు#గోరంట్ల#YCPcovertdrama#JaganDiversionPolitics
దీని ద్వారా..పరోక్షంగా కోటంరెడ్డి టీడీపీలోకి రావటం కోవర్టు ఆపరేషన్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ సారాంశంగా విశ్లేషణలు మొదలయ్యాయి. కోటంరెడ్డి ప్రతీ సభలోనూ సీఎం జగన్ కారణంగానే తాను ఎమ్మెల్యే కాగలిగానని చెబుతూ వచ్చారు. మంత్రి పదవి దక్కకపోవటం..తనకంటే జూనియర్లకు కేబినెట్ లో అవకాశం దక్కటం పైన కోటంరెడ్డి చాలా రోజులుగా ఆగ్రహంతో ఉన్నారు. కోటంరెడ్డి నేరుగా చంద్రబాబు ను కలిసారనే ప్రచారం సాగుతోంది. ఇక కోటంరెడ్డి అధికారికంగా టీడీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో టీడీపీ సీనియర్ నేత చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పైన టీడీపీ.. వైసీపీ రెండు పార్టీల మద్దతు దారులు స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.