తాడిపత్రిలో రాళ్లదాడి - జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సస్ కేతిరెడ్డి..!!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. తాడిపత్రి టీడీపీ ఇంఛార్జ్..జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్రెడ్డి తాడిపత్రిలో మూడు రోజులగా పర్యటన చేస్తున్నారు. మున్సిపాల్టీ పరిధిలోని పలు కాలనీల్లో ఈ పర్యటన సాగుతోంది. మూడో వార్డులో పర్యటిస్తున్న సమయంలో వైసీపీ శ్రేణులతో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో రాళ్ల దాడి చోటు చేసుకుంది. వార్డులో పర్యటన వేళ వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ సమయంలో టీడీపీ - వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
రాళ్ల దాడితో ఉద్రిక్తత
కొందరు అక్కడ ఉన్న సీసీ కెమేరాలను ధ్వంసం చేసారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొద్ది సేపు రెండు పార్టీల మద్దతు దారులు బాహా బాహీకి దిగారు. అక్కడకు చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదర గొట్టారు. ఘర్షణ విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. దీంతో, మరోసారి ఉద్రిక్తత మొదలైంది. ఈ ఘటనలో వైసీపీకి చెందిన హాజీ అనే కార్యకర్త తలకు గాయమైంది. టీడీపీకి చెందిన కొందరు మద్దతు దారులకు గాయాలైనట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన ఆరుగురి పైన టీడీపీ నేతలు స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
తాడిపత్రిలో పట్టు పెంచుకొనే దిశగా
గాయపడిన వారిని చికిత్సం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘర్షణల నేపథ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. కొంత కాలంగా తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి వర్సస్ కేతిరెడ్డి వర్గాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. గతంలో చోటు చేసుకున్న సవాళ్లు..ఘర్షణలతో పోలీసులు ప్రత్యేకంగా సున్నిత ప్రాంతాల పైన ఫోకస్ పెట్టారు. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు రెండు పార్టీల నేతలు సిద్దం అవుతున్న సమయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్ధి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పైన 7511 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కేతిరెడ్డి వర్సస్ ప్రభాకర్ రెడ్డి
గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పరాజయం పాలైనా..తాడిపత్రిలో మాత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తన కుమారుడే పోటీ చేస్తారని ఇప్పటికే ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేసారు. అదే సమంయలో మరోసారి కేతిరెడ్డి పెద్దిరెడ్డికే వైసీపీ టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు వర్గాలకు వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కావటంతో..ఇప్పటి నుంచే తమ ఆధిపత్యం నిరూపించుకొనే ప్రయత్నాలు మొదలయ్యాయి.