9వ తరగతి విద్యార్ధినిపై ఇంగ్లీష్ టీచర్ లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన
విశాఖపట్నం: 9వ తరగతి చదువుతున్న విద్యార్ధిని వేధిస్తున్న ఉపాధ్యాయుడిని ఆమె బంధువులు, గ్రామస్తులు నిలదీసిన సంఘటన విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం జానకయ్యపేటలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, జానకయ్య పేట హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న చినతీనార్లకు చెందిన ఓ బాలికపై ఇంగ్లీష్ టీచర్ ఈశ్వరరావు కొద్దికాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్తో వీడియోలు తీయడం, నువ్వంటే నాకిష్టమని లాంటి మాటాలు చెప్తూ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
టీచర్ కావడంతో భయపడి బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే ఇతని చేష్టలు రోజురోజుకీ శ్రుతిమించి పోవడంతో బుధవారం తల్లితో చెప్పింది. అతని బర్త్డే కేక్పై బాలిక ఫొటోను ముద్రించి తనను మానసికంగా వేధిస్తున్నాడని విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది.

మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆమె తండ్రి చేపల వేట నిమిత్తం పూరీ వెళ్లాడు. ప్రస్తుతం బాలిక ఆమె తల్లి వద్ద ఉంటోంది. విద్యార్థిని వేధింపుల విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎరిపల్లి శ్రీను, గ్రామ నాయకులు, బాధిత బాలిక బంధువులు తదితరులు పాఠశాలకు వెళ్లి వేధిస్తున్న ఉపాధ్యాయుడిని నిలదీశారు.
అయితే ఈ అమ్మాయి బాగా చదువుతుందని దానివల్ల నువ్వంటే నాకిష్టమని చెప్పానని అంతే తప్ప మరో ఉద్దేశం లేదని టీచర్ బదులిచ్చాడు. ఫోటోలు, వీడియోలు ఎందుకు తీశావని ప్రశ్నించగా, పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం సందర్భంగా తీశానని తెలిపాడు.
చివరకు ఇలా చేయడం తప్పేనని గ్రామస్తుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్ నూకరాజుతోపాటు, గ్రామస్తులు అతనిని మందలించారు. కాగా, బాలిక మాత్రం ఈశ్వరరావు ఇదే స్కూల్లో పనిచేస్తే తానిక్కడ చదవనని చెప్పింది.
దీంతో ఇటువంటి సమస్య మరే ఆడపిల్లకు రాకూడదని తక్షణమే సదరు ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ విషయంపై ఈడీఓకి తెలియజేసి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెడ్మాస్టర్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications