టీచర్లకు బయోమెట్రిక్ - పీఆర్సీ కమిటీకి రాజీనామాలు : ఉద్యమానికి కార్యాచరణ..!!!
ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు కీలకంగా మారాయి. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఫలించి..ఉద్యోగ సంఘాలు సమ్మె నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నాయి. ఇదే సమయంలో పీఆర్సీ సాధన సమితి నేతలు - ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందాల పైన ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలిపాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ సాధన సమితికి రాజీనామాలు చేసాయి. పోరుబాటకు సిద్దం అవుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు జేఏసీగా ఏర్పాటు అయ్యేందుకు నిర్ణయించాయి.

బయో మెట్రిక్ ఆదేశాలు
ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు సమాయత్తం అవుతున్న వేళ..సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఎర్రపార్టీలు, పచ్చపార్టీలకు సంబంధించిన కొన్ని యూనియన్లకు చెందిన కొందరు టీచర్లు పోరుబాట పడతామని చెప్పడం విచారకరమన్నారు.
ఇక, ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. ఈ రోజు నుంచి ప్రతి పాఠశాలలోను ఉపాధ్యాయుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవాలని తాజాగా ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మంగళవారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో అప్పటికప్పుడు ఈ ఆదేశాలిచ్చారు.

12న రౌండ్ టేబుల్ సమావేశం
అటు ఉపాధ్యాయ సంఘాలు సైతం ముందుకే వెళ్లాలని నిర్ణయించాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నాయి. మరోవైపు జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని ఏపీ యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీయూ సంఘాల నేతలు నిర్ణయించారు.
ఉద్యోగుల డిమాండ్లు సాధించకుండానే సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేశారు. పీఆర్సీపై నియమించిన మిశ్రా కమిటీ ఇచ్చిన రిపోర్టును తమకు ఇవ్వకుండానే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లడం వల్లే ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు.

సంఘాల నిరసన.. ప్రభుత్వం ఆచితూచి
ఈనెల 12న కలిసివచ్చే సంఘాలు, వ్యక్తులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామ ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు. రాజకీయ పార్టీల మద్దతు కోరడం లేదని, వారు అండగా నిలబడితే స్వాగతిస్తామన్నారు. కేఎ్సఎస్ ప్రసాద్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తమ సీనియర్లు సాధించి పెట్టిన హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
దీంతో..ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయనే ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రభుత్వం సైతం సంఘాల నేతల నిర్ణయాలను పరిశీలిస్తోంది. సంఘాల నేతలు కార్యాచరణ ప్రకటించిన తరువాత ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications