14 ఏళ్లు మాపై సస్పెన్షన్: హరీష్, ఇదేమిటని కిషన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల సస్పెన్షన్ విషయంపై శనివారం తెలంగాణ శాసనసభలో రగడ చోటు చేసుకుంది. తెలుగుదేశం సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలని బిజెపి సభ్యుడు లక్ష్మణ్ కోరగా, అందుకు ప్రభుత్వం వ్యతిరేకించింది. పార్లమెంటు సభ్యురాలిపై చేసిన వ్యాఖ్యకు క్షమాపణ చెప్తే సస్పెన్షన్ ఎత్తేయడానికి అభ్యంతరం లేదని, క్షమాపణ చెప్పించే బాధ్యతను లక్ష్మణ్ తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు అన్నారు.
శాసనసభలో ఏ పార్టీ ఎంత సేపు మాట్లాడిందీ హరీష్ రావు ఇచ్చిన వివరణపై బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సభ్యుడు ఎంపిని కించపరచలేదని, పత్రికలో వచ్చిన విషయం మాట్లాడారని కిషన్ రెడ్డి అన్నారు. తాము అడిగిందేమిటి, వారు చెబుతున్నదేమిటని కిషన్ రెడ్డి హరీష్ రావు మాటలపై అన్నారు.
శనివారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత జీరో అవర్ ప్రారంభమైంది. జీరో అవర్లో టిడిపి సభ్యులపై విధించిన సస్పెన్షన్ విషయం చర్చకు వచ్చింది. సస్పెన్షన్కు గురైన సభ్యుడికి పశ్చాత్తాపం లేదని హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి టిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. బయట ఆ సభ్యుడు పశ్చాత్తాపం ప్రకటించకపోగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. గవర్నర్పై దాడి చేస్తే మహారాష్ట్రలో సభ్యులను రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారని, పశ్చాత్తాపం ప్రకటించాలని చెప్పాలని ఆయన అన్నారు.

మూడు అంశాల విషయంలో టిడిపి సభ్యుడు తప్పు చేశారని హరీష్ రావు అన్నారు. విద్యుత్తు వాటా విషయంలో టిడిపి ఆరోపణలు చేసి, అందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని చెప్తే ఆ పత్రాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అడిగితే ఇవ్వలేదని, ఓ శాసనసభ్యుడి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని, సభలో లేని ఎంపిపై తప్పుడు ఆరోపణలు చేసి సభను తప్పు దోవ పట్టించారని ఆయన అన్నారు. లేని పత్రాలను ఉన్నట్లుగా చూపించి సభను తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేశారని ఆయన విమర్శించారు. పత్రాలు ఇవ్వాలని, వాటిని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి అడిగినా ఇవ్వలేదని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం ఇదే సభలో తమను 14 ఏళ్ల పాటు తమను సస్పెండ్ చేశారు. ప్రతి రోజూ తమపై సస్పెన్షన్లు, అరెస్టులు, బైండోవర్లు.. అని ఆయన అన్నారు. తాము ఆ విధంగా వ్యవహరించదలుచుకోలేదని, తాము సభ సజావుగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రతి రోజూ దుమారం చెలరేగగానే సభను కొనసాగించడానికి కాకుండా ప్రతి రోజూ రేపటికి వాయిదా వేసుకుంటూ పోయారని ఆయన అన్నారు. తాము అ విధంగా వ్యవహరించదలుచుకోలేదని ఆయన అన్నారు. సభ సజావుగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.
రికార్డులు పరిశీలిస్తే ఎన్ని గంటలు చర్చ జరిగిందో తెలుస్తుందని, ఇన్ని గంటల పాటు శాసనసభలో చర్చ జరిగిన సందర్భాలు గత ఎనిమిదేళ్లలో ఉన్నాయా అని హరీష్ రావు అన్నారు. అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం కట్టుబడి ఉందనేది రికార్డులు చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. రైతులకు కరెంట్ రాకుండా పోతుంటే, ప్రభుత్వానికి రావాల్సిన వాటా ఇవ్వాలని అడగాల్సింది పోయి ఆ విధంగా వ్యవహరించడం టిడిపి సభ్యులకు సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించే విధానాన్ని సమర్థిద్దాదామా అని హరీష్ రావు అడిగారు.
నిన్న సస్పెన్షన్కు గురికాని టిడిపి సభ్యులు సభకు వచ్చారని, వారు మాట్లాడుతుంటే తాము అడ్డుకోలేదని, పోడియం వద్దకు వచ్చి సభను అడ్డుకోవడానికి ప్రయత్నించినవారినే సస్పెండ్ చేశామని, సభా మర్యాదలకు భంగం కలిగించే విధంగా తాము వ్యవహరించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications