టిడిపి ఆఫీసుపై గుడ్లు, రాళ్ల దాడి: పొన్నం తల్లి కంటతడి
వరంగల్: పార్లమెంటులో సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల వైఖరిని నిరసిస్తూ గురువారం వరంగల్ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన న్యాయవాదులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.
జిల్లా కోర్టు నుంచి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మతో న్యయవాదులు ర్యాలీగా బయలుదేరి టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంపై దాడి చేశారు. అనంతరం బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ తల్లి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె కంటతడి పెట్టారు. లోకసభలో జరిగిన పెప్పర్ స్ప్రేలో పొన్నం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
కాగా, వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. గురువారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎన్టీ రామారావు విగ్రహం పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీ రామారావు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications