అధిష్టానం సిగ్గుపడుతోంది: కిరణ్పై కోమటిరెడ్డి, 'టి' ఫైర్
నల్గొండ/కరీంనగర్/హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినందుకు ఇప్పుడు తమ పార్టీ అధిష్టానం సిగ్గు పడుతోందని మాజీ మంత్రి, నల్గొండ జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం అన్నారు. జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్ర విభజన జరిగితే నక్సలిజం పెరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ను చేసినందుకు అధిష్టానం పశ్చాత్తాపపడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరు అడ్డుకోలేరని తెలిపారు.
తెరాస వల్లనే: మల్లు భట్టి
1956కు ముందున్న తెలంగాణ కావాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి వాదన వల్లనే భద్రాచలం డివిజన్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క అన్నారు. తెరాస పాత విషయాలు వదిలి పది జిల్లా తెలంగాణ కోసం డిమాండ్ చేయాలన్నారు.
కిరణ్ ఫ్లెక్సీ తొలగింపు
కరీంనగర్ జిల్లా జగిత్యాల రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీని తొలగించారు. రచ్చబండ ప్రారంభం కాకముందే సర్పంచుల సంఘం నేతలు వేదిక పైకి వచ్చి కిరణ్ ఫ్లెక్సీని తొలగించి నినాదాలు చేశారు. సమైక్య ముఖ్యమంత్రి ఫోటో తెలంగాణలో ఉండరాదని నినాదాలు చేశారు.