టి కోసం వేరేమార్గం చూడాలా: మంత్రులకి కోదండ వార్న్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమను మరో మార్గం చూసుకోమంటారా? అని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం ప్రశ్నించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులే వెల్లోకి వెళ్లడమేమిటని ప్రశ్నించారు. కేంద్రమంత్రులే వెల్లోకి వెళ్తే తాము ఏ వ్యవస్థలను నమ్ముకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సమస్యకైనా రాజ్యాంగం, పార్లమెంటు ద్వారానే పరిష్కారం లభిస్తుందని కానీ రాష్ట్ర విభజన కోసం మరో మార్గం చూసుకోమంటారా అన్నారు.
బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రులే ఈ రకంగా వ్యవహరిస్తే, ఇక ప్రజాస్వామ్యంపై ఎవరికి విశ్వాసం ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. సభా నిర్వహణకు ఆటంకం కలిగిస్తే సమస్య పరిష్కారం కాదన్నారు.
విభజనపై పార్లమెంటులో చర్చ జరుగుతుందని, అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారని భావించామని, సభలో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ, అడ్డుకోవటం ప్రజాస్వామ్య వ్యతిరేకమని, దుర్మార్గమని అన్నారు. పార్లమెంటునే అడ్డుకుంటే, ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.
విభజనని అడ్డుకునేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు నిరసన తెలపాల్సిందిగా ప్రజలకు కోదండరామ్ పిలుపునిచ్చారు. గతంలో రాష్ట్ర విభజనకు అంగీకరించిన జగన్ ఇప్పుడు విభజన ఆపాలని కోరుతున్నారని, చంద్రబాబు సమన్యాయం పేరుతో తెలంగాణను అడ్డుకోవటానికి అవినీతి, అక్రమ పద్ధతులను అవలంబిస్తున్నారన్నారు.