రాత్రికి రాత్రే కాదు: నరసింహన్, ఏపీ ప్రతిపాదనకు టీ నో
హైదరాబాద్: ఇంటర్ బోర్డు పరీక్షలన నిర్వహణ పైన చర్చలు జరుగుతున్నాయని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని, ఏ సమస్య కూడా రాత్రికి రాత్రే పరిష్కారం కాదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గురువారం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, బుధవారం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో గవర్నర్తో చర్చించారు.
అయితే, ఈ ఇంటర్ పరీక్షల వ్యవహారం కొలిక్కి రాలేదు. పరీక్షల నిర్వహణ వ్యవహారంలో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు మరో అడుగు ముందుకేసి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. గవర్నర్ నరసింహన్ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల సీఎస్లు ఎవరి వాదన వారు వినిపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇరు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులు వికాస్రాజ్, అథర్సిన్హా, ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్తో పాటు సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తమ ఇంటర్ పరీక్షలను తామే ప్రత్యేకంగా నిర్వహించుకుంటామని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఉమ్మడిగానే ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని ఏపీ సీఎస్ కృష్ణారావు ఈ సమావేశంలో చెప్పారు. తమ వాదనను సమర్థించుకుంటూ వారు పలు కారణాలను ఉదహరించినట్లు సమాచారం. రాష్ట్రం విడిపోయినందున ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే ఆలోచన తమకు లేదని తెలంగాణ ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది.
ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం అన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలను ఉమ్మడిగా రాసిన విద్యార్థులకు రెండో సంవత్సరం పరీక్షలు కూడా అలాగే నిర్వహించాలని తాము చెబుతున్నామన్నారు.
ఎంసెట్తో పాటు జాతీయ స్థాయిలో జరిగే ఇతర ప్రవేశ పరీక్షలు రాసిన అభ్యర్థులకు ర్యాంకుల నిర్థారణలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉన్న విషయాన్ని గమనించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. మరో మూడు నెలల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున విద్యార్థులకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే మార్చి 9 నుంచే పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications