Telugu: మాతృభాషకు పట్టం: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఇక తెలుగు తప్పనిసరి.. !
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాతృభాషకు పట్టం కట్టింది. మాతృభాషను మృతభాషగా మార్చుతోందంటూ ఆరోపణలు, విమర్శలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్.. ఇంకో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేసింది. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందని వెల్లడించింది.

భాషాభిమానుల ఆందోళన నేపథ్యంలో..
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, మేనేజ్ మెంట్ పాఠశాలలన్నింట్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేసినట్లు ఆయన ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యా బోధనను కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ నాయకులు, తెలుగు భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

మాతృభాష.. ఇక మృత భాష కాదు..
తెలుగుదేశం, జనసేన పార్టీ సహా పలువురు భాషాభిమానులు తమ ఆందోళనను వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మాతృభాష ఇక మృత భాషగా మారుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. తాము ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు భాషలో విద్యాబోధన సాగించడానికి వ్యతిరేకం కాదని పేర్కొంది. జనసేన మాత్రం తన నిర్ణయానికి కట్టుబడింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచే..
ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కార్.. ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు, మేనేజ్ మెంట్ పాఠశాలన్నింట్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 2020-2012 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఫలితంగా- రాష్ట్రంలో ఉన్న 15 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు వేల సంఖ్యలో ఉన్న ప్రైవేటు, మేనేజ్ మెంట్ స్కూళ్లల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా బోధించడం తప్పనిసరిగా మారింది.












Click it and Unblock the Notifications