శ్రీవారి అన్నప్రసాదంలో ఏడు వెరైటీల పప్పులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం 82,438 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 39,948 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది.
ఆ ఒక్క రోజే 4.16 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. రికార్డు స్థాయిలో 2.14 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీని అందిస్తున్నారు. అదనపు షెడ్లను అమర్చారు.

కాగా తిరుమలలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే ఉద్దేశంతో ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. వారికి పలు సూచనలు చేశారు.
రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగలు వంటి ఏడు రకాల పప్పు దినుసులను వినియోగిస్తోన్నామని ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి తెలిపారు. గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదే విధంగా ఏపీ పప్పు మిల్లర్ల నుంచి కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు.
దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు మహాయజ్ఞంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములమౌతామని, నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం మిల్లర్ల నుంచి పప్పు దినుసుల కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.












Click it and Unblock the Notifications