అన్న ప్రసాదాలపై TTD రివ్యూ: బ్రహ్మోత్సవాల నాటికి..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో అత్యంత వైభవంగా, కన్నుల పండువగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. వీటిని విజయవంతం చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. వరుస సమీక్షలను నిర్వహిస్తోంది. విభాగాధిపతులకు అవసరమైన ఆదేశాలను ఇస్తూ వస్తోంది.
ఈ క్రమంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. అన్న ప్రసాదాల తయారీకి కూరగాయలను విరాళంగా అందిస్తున్నదాతలతో సమావేశం అయ్యారు. బ్రహ్మోత్సవాల సమయంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో చర్చించారు. లక్షలాదిమంది భక్తులు తిరుమలకు రాబోతోన్నందున కూరగాయల సరఫరా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

శ్రీవారి అన్న ప్రసాద వితరణలో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైనవని సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. గత నాలుగైదు నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు నాలుగు లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం సగటున 13 నుంచి 14 టన్నుల బియ్యం, ఎనిమిది టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కూరగాయలను నిరంతరం దాతల ద్వారా సమకూరడం గొప్ప విషయమని అన్నారు.
గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల నుంచి 30 మంది దాతలు 33 రకాల కూరగాయలను సమకూరుస్తున్నారని వివరించారు. అన్నప్రసాదం అవసరాలకు అనుగుణంగా ఏ సమయంలో ఏ కూరగాయ ఎంత అవసరమో ముందుగానే ప్రణాళిక రూపొందించి, దాతలతో సమన్వయం చేసుకుని కూరగాయలను స్వీకరిస్తున్నామని, నాణ్యత, ప్యాకింగ్, రవాణా తదితర అంశాల్లో దాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అభినందించారు.
కూరగాయలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగినవి కావడం వల్ల వాటిని నిల్వ ఉంచడంలో కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని వినియోగించుకుంటోన్నట్లు వెంకయ్య చౌదరి వివరించారు. మూడేళ్ల కిందటి వరకు రోజూ సుమారు 5.34 టన్నుల కూరగాయల వినియోగం ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 8.44 టన్నులకు పెరిగిందని, దీనికి అనుగుణంగా వాటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
భవిష్యత్తులో కూరగాయల విరాళాల కోసం ప్రత్యేక పాలసీ, ఆన్లైన్ సమన్వయ వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని వెంకయ్య చౌదరి చెప్పారు. ఎక్కడి నుంచి ఏ కూరగాయ ఎంత అవసరమో రియల్టైమ్లో ఆన్లైన్ ద్వారా దాతలకు తెలియజేయడం, దాతలు కూడా స్పందించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తే కమ్యూనికేషన్ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. దీనివల్ల మరింత మంది దాతలు ఈ మహత్తర సేవలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
రాబోయే రెండు బ్రహ్మోత్సవాల్లోనూ కూరగాయల దాతలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఆదివారం, వారాంతపు రోజులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో సుమారు 4.50 లక్షల అన్నప్రసాద పోర్షన్లు పంపిణీ చేస్తున్నామని, రోజుకు సుమారు 19 గంటల పాటు అన్నదానం వంటశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. దాతలను మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.















Click it and Unblock the Notifications