నారావారి విందు.. మహానాడులో 200 వంటకాలు
తెలుగుదేశం వ్యవస్థాపలు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా పసుపు పండగ మహానాడు జరగనుంది.
ఎన్నికలకు కేవలం ఏడాది వ్యవధే ఉన్న తరుణంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

మహానాడు నిర్వహణకు ప్రభుత్వం కావాలనే అడ్డంకులు కల్పిస్తోందని, వైసీపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమండ్రికి చేరుకోనున్నారు. సాయంత్రం జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు అజెండా తో పాటు పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలకు ఒక రూపునివ్వనున్నారు.
చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలకు వేదికగా నిలిచిన రాజమండ్రి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. 200 ఎకరాల విస్తీర్ణంలో వేడుక జరపాలని, ఈసారి మహానాడు జరిగే సమయానికి అధికారంలో ఉండాలని తలపోస్తున్నారు. 27వ తేదీన ప్రతినిధుల సభ, 28న మహానాడు బహిరంగసభ జరగనుంది. పార్కింగ్, భోజన స్టాళ్లకు 140 ఎకరాలు కేటాయించారు.
15 వేల మంది కూర్చొనేలా 9 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అలాగే లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు సంబంధించిన ఫొటోలతో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరం, సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ వంటి ఏర్పాట్లు ఉంటాయి. వీఐపీలకు, పార్టీ ప్రతినిధులకు రాజమండ్రి రుచులు చూపించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 200 రకాల వంటకాలను తయారుచేయిస్తున్నారు. మొత్తం 19 తీర్మానాలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications