నిన్న బల్క్ డ్రగ్ పార్కు - నేడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ:భగ్గమన్న ఆందోళనలు..!!
కొద్ది రోజుల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె కాన్వాయ్ను మత్స్యకారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో చేసేదేమీ లేక మంత్రి అనిత వెనక్కు తిరిగి వెళ్లిపోయారు. తాజాగా అదే విశాఖ జిల్లాలో పెదగంట్యాడ ప్రజలు మరో కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. గాజువాక నియోజకవర్గంలోని పెద గంట్యాడ ప్రాంతంలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు (బుధవారం) గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రణరంగంగా మారింది.
సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువకులు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కొత్త పరిశ్రమ కారణంగా పర్యావరణ కాలుష్యం పెరగడం, వ్యవసాయ భూముల స్వాధీనం, ఉపాధి అవకాశాలు నష్టపోవడం జరుగుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

"అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు.. పెద గంట్యాడను రక్షించుకుందాం!" అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రభుత్వంపై, అలాగే స్థానిక నాయకుడు పళ్ళ శ్రీనివాస్ పైనా వ్యతిరేక నినాదాలు వినిపించాయి.
కాలుష్యంతో భవిష్యత్తు ప్రమాదంలో
ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద పరిస్థితి అదుపు తప్పింది. సీపీఎం మరియు పలు ప్రజా సంఘాల నాయకులు గ్రామస్తులతో కలిసి ఫ్యాక్టరీ నిర్మాణ ప్రణాళికను తక్షణమే రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
స్థానికులు తమ గోడు వెళ్లబోసుకుంటూ... "మా ప్రాంతంలో ఇప్పటికే అనేక పరిశ్రమలు ఉండటం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. మా ఆరోగ్యం, మా పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా మరో సిమెంట్ ఫ్యాక్టరీని అస్సలు అనుమతించం" అని స్పష్టం చేశారు.
అధికారులు మాత్రం, ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకున్న తర్వాత నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. పెద గంట్యాడలో పోలీసుల మోహరింపుతో 'హై టెన్షన్' వాతావరణం కొనసాగుతోంది. గ్రామమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది












Click it and Unblock the Notifications