మీకు పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి..: పులివెందులలో..!!
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. పలు చోట్ల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా రిగ్గింగ్ జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తోన్నారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని పోలింగ్ బూత్ లను బయటికి పంపించారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు విచ్చలవిడిగా రిగ్గింగ్కు పాల్పడుతున్నారని విమర్శిస్తోన్నారు.

ఆర్ తుమ్మలపల్లిలో తనను కూడా ఓటు వెయ్యనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా ఉంచారని, జిల్లా ఎస్ఫీకి ఫోన్ కాల్ చేసినా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తన గన్మెన్ని కూడా ఉన్న పళంగా మార్చేశారని ఆయన చెప్పారు. నిన్నటి వరకు ఉన్న గన్మెన్ను తొలగించి మరొకరిని పంపారని తెలిపారు. బయటి నుండి వచ్చిన వ్యక్తులతో టీడీపీ నేతలు దొంగఓట్లు వేయిస్తున్నారని విమర్శించారు. దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, టీడీపీ నాయకులు ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు.
ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటోన్న ఓటర్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, పోలింగ కేంద్రాల చుట్టూ
కర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. ఈ. కొత్తపల్లిలో టీడీపీ ఓటర్లను తప్ప మిగతా వారిని ఓటు వేయడానికి అనుమతించట్లేదని హేమంత్ రెడ్డి అన్నారు.
ఓటు వేయడానికి వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లగా దౌర్జన్యంగా వెనక్కి పంపించారని, గతంలో ఎన్నడు బూతులను ఆక్రమించలేదని, పోలింగ్ బూత్లల్లో పులివెందులకు సంబంధించిన వ్యక్తులు లేరని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉన్నారని ఓటర్లు ఫిర్యాదు చేసినట్లు హేమంత్ రెడ్డి చెప్పారు.
పోలింగ్ బూత్ లను ఆక్రమించి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వట్లేదని హేమంత్ అన్నారు. ఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్నారని, ఒక్కో గ్రామంలో 300 మందికి పైగా బయటి వ్యక్తులు ఉన్నారని, మీడియా ప్రతినిధులను గ్రామం బయటే అడ్డుకుని కెమెరాలు లాక్కుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications