ఏపీ, తెలంగాణలో ఉగ్రవాదుల టెర్రర్?
ఉగ్రవాదులకు శిక్షణ, ఫండింగ్ సమకూర్చడం, ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నూలులో ఎస్డీపీఐ నేత అబ్దుల్ వారిజ్ ఇంట్లో తెల్లవారుజామున మూడు గంటలకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్డీపీఐ నాయకులు వీరిని అడ్డగించే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి సమయంలో ఇళ్లపై దాడులు చేయడం సరికాదని, ఇవి ఆపాలంటూ నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గుంటూరులోని ఆటోనగర్ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
టెర్రర్ ఫండింగ్ వ్యవహారంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లో కూడా సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 100 మందిని అరెస్ట్ చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్ తో పాటు ఏపీలోని కర్నూలు, గుంటూరులో తనిఖీలు జరిగాయి.
రెండు రోజుల క్రితం జరిగిన దాడుల్లో కూడా పలువురిని హైదరాబాద్ కు తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు. ఎన్ ఐఏ అధికారులకు ఈడీ, స్థానిక పోలీసులు సహకరిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ దాడులు జరుగుతున్నాయి. గత ఆదివారంరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోను సోదాలు జరిగిన విషయం తెలిసిందే.