వివేకా హత్య వెంటనే ఆయన రోడ్డుపై పరిగెత్తారు : ఆ ముగ్గురూ గోడ దూకి పారిపోయారు : సీబీఐ సంచలన రిపోర్టు..!!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మాజీ మంత్రి..సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన అంశాలను బయట పెట్టింది. వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది. వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వర్రెడ్డి సోదరుడు, ఈ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న గజ్జల ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ కడపలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో కీలక అంశాలను ప్రస్తావించింది.

ఆ నలుగురి పాత్రపై స్పష్టత
వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి, షేక్ దస్తగిరి పాత్ర ఉందని పులివెందుల కోర్టులో అక్టోబరు 27న సీబీఐ ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో.. ఆయన రహదారిపై పరుగు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని దుకాణం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వెల్లడించింది. వివేకా హత్య కేసులో ఉమా శంకర రెడ్డి పాత్ర కీలకమని సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.

అర్ద్రరాత్రి పరుగులు - గోడ దూకి పారిపోతూ
ఆయన నార్కో అనాలసిస్ పరీక్షలకు సైతం అంగీకరించలేదన్నారు. తెల్లవారు జామున ఉమా శంకర రెడ్డి పరుగు తీరును సంతంత్ర సాక్ష్యుల సమక్షంలో వీడియో రికార్డు చేసామన్నారు. దీనిని గుజరాత్ గాంధీ నగర్ లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్..బెంగుళూరులోని ఫిల్మ్ ఫ్యాక్టర్ పంపామని కోర్టుకు నివేదించారు. రెండు పరుగుల్లోనూ సారూప్యత ఉందని అవి అభిప్రాయపడ్డాయని కోర్టుకు వివరించారు. వివేకా హత్య విషయంలో తమ కదలికలు బయట పడకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారని సీబీఐ పేర్కొంది.

ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో సమావేశం
హత్యకు పది రోజుల ముందు వివేకా ఇంట్లోని కుక్కను సునీల్ యాదవ్...ఉమా శంకర్ రెడ్డి కారుతో ఢీ కొట్టి చంపారని వివరించింది. నిందితులను గుర్తించే ప్రక్రియలో ఎర్ర గంగిరెడ్డి..సునీల్ యాదవ్..దస్తగిరి .. ఉమాశంకర్ రెడ్డిలను వాచ్ మెన్ రంగన్న గుర్తించారని పేర్కొన్నారు. సునీల్..ఉమా శంకర్..దస్తగిరి గోడ దూకి పారిపోయారని వివరించారు. ఎర్రగంగిరెడ్డి బయటకు వెళ్తూ ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ తనను బెదిరించారని రంగన్న చెప్పిన విషయాన్ని సీబీఐ పేర్కొంది. 2019 మార్చి 15న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో వారంతా సమావేశమయ్యరు.

వాచ్ మెన్ ను బెదిరించి పారిపోయారు
సునీల్ తో కలిసి దాడి చేసిన నేపథ్యంలో ఉమాశంకర రెడ్డి బెయిల్ కు అనర్హుడని సీబీఐ వాదించింది. కుట్ర కోణం తేల్చటానికి తదుపరి విచారణ తేల్చాల్సి ఉన్నందున ఆ దశలో బెయిల్ ఇవ్వలేమంటూ న్యాయస్థానం బెయిల్ పీటీషన్ కొట్టివేసింది. కొద్ది రోజుల కిందట వివేకా హత్య కేసులో ఆ నలుగురు కీలకమంటూ సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఆ విషయాన్ని బయటకు వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఉమా శంకర రెడ్డితో పాటుగా ఆ ముగ్గురి పాత్ర పైన సీబీఐ ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications