సీఎంలు జగన్ - కేసీఆర్ కు కేంద్రం జలక్ : ప్రతిపాదనల తిరస్కరణ - స్టాలిన్ బాటలో వెళ్తారా..!!
కేంద్రం తెలుగు రాష్ట్రాలను పట్టించుకోవటం లేదా. వివక్ష చూపుతోందా. ఢిల్లీ ఎర్రకోట వేదికగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వలేదు. మరి..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేయబోతున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయంగా హాట్ డిబేట్ కు కారణమవుతోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ స్ఫూర్తికి అద్దం పట్టేలా శకటాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.
పింగళి వెంకయ్యపై శకటం
దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యపై శకటాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిది. దీనిని కూడా తిరస్కరించడంతో అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన శకటానికి ఈ సారి కూడా గుర్తింపు ఇవ్వకపోవటం ప్రశ్నార్దకంగా మారుతోంది. దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్తో పాటు, తెలంగాణ, కేరళ. తమిళనాడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుండి తిరస్కారం లభించింది. బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటక మాత్రమే అవకాశం దక్కించుకుంది. మినహాయింపు. ఆ రాష్ట్ర శకటానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తమ శకటాలకు అనుమతి ఇవ్వకపోవడంపై కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి.
దక్షిణాదిన కర్ణాటకకు మాత్రమే
కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టాయి. ఈ విషయంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. తిరస్కరణకు స్పష్టమైన కారణాలను కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చెందిన తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలునాచయ్యర్ . ప్రముఖ కవి భారతీయార్ స్ఫూర్తితో రూపొందించిన శకటాలను నాలుగు రిహార్సిల్స్ అయిన తరువాత తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ చర్యపై తమిళనాడులో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేఖ కూడా రాశారు.
నేతాజీ శకటం సైతం తిరస్కరణ
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతిని పురస్కరించుకుని 23వ తేదినుండే గణతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దానినే కేంద్రంగా చేసుకుని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూపొందించిన నేతాజీ శకటాన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. ఈ పరిణామంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలను అవమానపరిచారంటూ ప్రధానికి లేఖ రాసింది. జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యం
బోసు శకటం తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. చిత్రమేమిటంటే స్వాతంత్ర సమర స్ఫూర్తితో రూపొందించిన శకటాలను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం కాశీ విశ్వనాథ్ ఆలయ నమూనాతో తయారు చేసిన ఉత్తరప్రదేశ్ శకటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు అరుణాచల్ప్రదేశ్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, మేఘాలయ, జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు అనుమతి లభించింది. వీటిలో ఎక్కువ భాగం బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటుగా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వల అసహనం
నారాయణ గురు శకటాన్ని ప్రదర్శిస్తామంటూ కేరళ చేసిన ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. దీనిపై కేరళతో పాటు కర్ణాటకలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రం తీరు పైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏపీ ప్రభుత్వం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యపై శకటాన్ని రూపొందిస్తే... ఎందుకు తిరస్కరించారనేది కేంద్రం నుంచి స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర శైలి పైన స్టాలిన్ ఓపెన్ గా లేఖ రాసారు. మరి..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.