విధి రాత:కొడుకు చికిత్స కోసం వచ్చి ప్రమాదంలో తండ్రి మృతి...సిగరెట్టే కారణం!
అనంతపురం:విధి రాత ఎవరికీ అర్థం కాదంటూ ఉంటారు వేదాంతులు ...కొన్ని ఘటనలు చూస్తే అది నిజమేనని అంగీకరించేలా ఉంటాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చోటుచేసుకున్న ఈ ఘటన కూడా అందుకు నిదర్శనం లా కనిపిస్తోంది.
తీవ్ర అనార్యోగంతో బాధపడుతున్న కొడుకుకు మంచి చికిత్స అందించి కాపాడుకోవాలని తాపత్రయ పడ్డ ఒక తండ్రి అనూహ్య రీతిలో జరిగిన ప్రమాదంలో తాను ప్రాణాలు కోల్పోయాడు. సిగిరెట్ తాగుతున్న ఆటో డ్రైవర్ ను పిల్లాడికి సరిపడదు పడేయమని తల్లి కోరగా...సిగిరెట్ పడేసే క్రమంలో ఆటో అదుపు తప్పి రోడ్డు మధ్య భాగంలోకి వెల్లడం...అంతలోనే ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో బాలుడి తండ్రి చనిపోగా...తల్లి,కుమారుడు, ఆటో డ్రైవర్ గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం...పశ్చిమబంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్కు చెందిన అభయ్రంజన్ దత్తా (36) తన కుమారుడు కౌసిక్దత్తా కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో రెండు రోజుల క్రితం భార్య, సమీప బంధువుతో కలిసి పుట్టపర్తిలోని సత్యసాయి ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడి చికిత్స కోసం బెంగళూరు సత్యసాయి ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. బెంగళూరు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లాలని ఆసుపత్రి నుంచి పుట్టపర్తి బస్టాండ్ కు ఆటో ఎక్కారు.
ఈ క్రమంలో ఆటోడ్రైవర్ సిగరెట్ వెలిగించాడు. అయితే తన కుమారుడి ఆరోగ్యం బాగాలేదు...సిగిరెట్ పొగతో ఇబ్బంది పడతాడు పారేయమని పిల్లవాడి తల్లి ఆటోడ్రైవర్ ను కోరింది. డ్రైవర్ సరేనంటూ సిగిరెట్ పారేసేందుకు ఇటు పక్కకి తిరగడంతో క్షణాల్లో రోడ్డు మధ్య భాగం వైపు వెళ్లిన ఆటో...ఆర్టీసీ బస్సును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బాలుడి తండ్రి అభయ్రంజన్ దత్తా అక్కడికక్కడే మృతి చెందాడు.
కొడుకు ఆరోగ్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చి...నువ్వు వెళ్లిపోయావా...ఇంక మాకు దిక్కెవరంటూ...బాలుడి తల్లి రోదనలు ప్రత్యక్ష సాక్షులను కంటతడి పెట్టించాయి. అనంతరం ప్రమాదంలో గాయపడిన భార్య, కుమారుడు, సమీప బంధువుతో పాటు ఆటోడ్రైవర్ సత్యసాయి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.