APలో BJPకి వ్యతిరేకంగా రంగంలోకి దిగిన ప్రత్యర్థి?
గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది బీజేపీ
భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత దూకుడు పెంచింది. ఖమ్మంతోపాటు మహారాష్ట్రలో బహిరంగసభలు నిర్వహించింది. సాధ్యమైనంత వేగంగా దేశం మొత్తం విస్తరిస్తూ భారతీయ జనతాపార్టీకి ప్రత్యామ్నాయపార్టీగా ఆవిర్భవించడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది బీజేపీ. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాల్లోనైనా గెలవగలిగింది. ప్రస్తుత స్థానిక నాయకత్వం తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వ్యతిరేకంగా ఉండటంతో దీనికి సంబంధించి అధిష్టానం కూడా అడుగులు వేయలేకపోతోంది. ఏపీలో వైసీపీ, తెలుగుదేశం హోరాహోరీగా తలపడుతున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకొని టీడీపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. చివరి వరకు బీజేపీ కోసం రెండు పార్టీలు వేచిచూసే ధోరణిని అవలంబించాలనుకుంటున్నాయి.

చీలనున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు
భారత రాష్ట్ర సమితి ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టడంవల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలి వైసీపీకే మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాపు సామాజికవర్గాన్ని పునాదిగా చేసుకొని బీఆర్ఎస్ ఏపీలో ఎదగాలనుకుంటోంది. అందుకు నిదర్శనంగా తోట చంద్రశేఖర్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీచేయడంవల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయి దాదాపు 60 నుంచి 65 స్థానాల్లో వైసీపీకి లబ్ధి చేకూరింది. అయితే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తే గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా ఉండేందుకు ఆ పార్టీ నాయకులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను మాటలతో రెచ్చగొడుతున్నారు.

ఎలాంటి ప్రత్యామ్నాయమో?
భారత రాష్ట్ర సమితి 175 నియోజకవర్గాలను అభ్యర్థులను నిలబెడితే జగన్ కు మేలు జరుగుతుందని, తెలుగుదేశం-జనసేన ద్వారా ఏకమయ్యే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఈ పార్టీద్వారా చీలిపోతాయని అంచనా వేస్తున్నారు. వైఎస్ జగన్, కేసీఆర్.. ఇద్దరూ స్నేహితులే కాబట్టి ఒకరికొకరు మేలు చేయడానికే ప్రయత్నిస్తుంటారని అంచనా వేస్తున్నారు. ఒకరకంగా కాపుల ఓట్ల చీలికతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన బీఆర్ఎస్ నోటా కంటే తక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్న ఏపీ బీజేపీకి ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుందో చెప్పాలని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications