బిజెపికి రాజీనామా చేసిన ఆ మహిళా నేత...టీడీపీ గూట్లోకేనా?...ఔనంటున్నారు!
హైదరాబాద్: ఏపీలో బీజేపీకీ ఆ పార్టీ నేతలు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేయాలని బిజెపి యోచిస్తుండగా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
తాజాగా శనివారం బిజెపి మహిళా నేత, భాజపా మహిళా విభాగంలో కీలక పాత్ర పోషించిన కాట్రగడ్డ ప్రసూన బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె టీడీపీలో చేరే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలావుంటే తమ పార్టీ మహిళా నేత పార్టీని వీడటంపై భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి ప్రకటనా విడుదల కాకపోవడం గమనార్హం.
కాట్రగడ్డ బిజెపి మహిళా నేత గానే కాకుండా సెటిలర్స్ ఫోరం అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఇటీవల సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సెటిలర్స్ ఓట్లను భారీగా తొలగించారని ఆమె మండిపడ్డారు. ఆ క్రమంలో బల్కంపేట పోలింగ్ కేంద్రం వద్ద ప్రసూన ఆందోళన కూడా నిర్వహించారు. అయితే ఈమెను టిడిపిలోకి ఆహ్వానం పలికిన క్రమంలో సానుకూలంగా స్పందించారని, అన్ని సమీకరణాలు అంచనా వేసి బిజెపికి రాజీనామా చేశారని, ఇక టిడిపిలో చేరడం లాంఛనమేనని టిడిపి వర్గాలు అంటున్నాయి.
ఇక బిజెపికి సంబంధించి వరుస వలసలు ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇటీవల బాపట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఆవుల వెంకటేశ్వర్లు కూడా బీజేపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఆధ్వర్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.
అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు, ఆయన కుమారుడితో సహా తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా టీడీపీ కండువా కప్పి రఘురామ కృష్ణంరాజును పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆ తరువాత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా ఆ పార్టీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.