జగన్ చెప్పిన దేవుడి స్క్రిప్ట్ తన విషయంలో నిజమైందా ? సోషల్ ట్రోలింగ్..
ఏపీలో ఈసారి జనం ఇచ్చిన తీర్పు అధికారంలో ఉన్న వైసీపీకి శరాఘాతంగా మారింది. ఓటమి ఓ ఎత్తయితే ఓడిపోయిన తీరు, సాధించిన సీట్లు జగన్ కు, ఆయన పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారిపోతున్నాయి.అదే సమయంలో గతంలో జగన్ విపక్ష టీడీపీని ఉద్దేశించి వేసిన డైలాగ్స్ ఇప్పుడు తిరిగి ఆయనకే గుచ్చుకుంటున్నాయి. ఆ స్ధాయిలో సోషల్ మీడియాలో వాటిని గుర్తుచేస్తూ నెటిజన్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా జగన్ పాత దేవుడి స్క్రిప్ట్ డైలాగ్ తిరిగి తెరపైకి వచ్చింది.
గతంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలైంది. 2014లో సాధించిన 106 సీట్ల నుంచి ఏకంగా 23 సీట్లకు పడిపోయింది. అయితే 2014-19 మధ్య కాలంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తనవైపుకు తిప్పుకున్నారు. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. దీనిపై వైసీపీ అప్పట్లో తీవ్రంగా మండిపడేది. చివరికి వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీకి వచ్చిన 23 ఎమ్మెల్యేలపై స్పందిస్తూ దేవుడి స్క్రిప్ట్ గా అభివర్ణించారు. తన నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబుకు దేవుడు సరిగ్గా అంతే మందిని తిరిగి గెలిపించాడన్నారు.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లతో సునామీ సృష్టించింది. వైసీపీ గతంలో సాధించిన 151 సీట్ల రికార్డును తుడిచిపెడుతూ భారీ విజయం అందుకుంది. దీంతో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. అయితే ఈసారి టీడీపీ కూటమి సాధించిన సంఖ్య 164లో అంకెల్ని కూడితే 11 సంఖ్య వస్తుంది. దీంతో ఇది కూడా దేవుడి స్క్రిప్టే అంటూ సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. దీనికి వైసీపీ నుంచి సమాధానం రావడం లేదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా ప్రత్యర్థుల్ని కించపరచడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications