అప్పుడు వర్ల, ఇప్పుడు బీటెక్ రవి- చంద్రబాబు వ్యూహాలకు సమిధలుగా..
ఏపీలో విపక్ష టీడీపీలో ఎంతో కాలంగా క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతల్లో ఇప్పుడు కొత్త భయం కనిపిస్తోంది. పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా తాము ఎక్కడ బలిపశువులు అవుతామా అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. మారుతున్న పరిస్ధితుల్లో వైసీపీని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగా పార్టీ అధిష్టానం తమను వాడుకుంటున్న తీరు వారి భవిష్యత్తుపై ఉన్న కాస్తో కూస్తో ఆశలను నీరుగార్చేలా ఉంటోంది. దీంతో అటు అధిష్టానానికి ఎదురు చెప్పలేక, అలాగని తాజా రాజకీయ క్రీడలో సమిధలుగా మారలేక నలిగిపోతున్నట్లు తెలుస్తోంది.
కాక రేపుతున్న సవాళ్లు... 48గంటల డెడ్ లైన్... వైసీపీ-టీడీపీ హోరాహోరీ రాజకీయం...
టీడీపీ రాజకీయ క్రీడ...
ఏపీ టీడీపీలో సీనియర్లకు కొదవలేదు. గతంలో ప్రజారాజ్యం ఆవిర్భావం సమయంలో పార్టీని వీడిన కొందరు సీనియర్లు కూడా రాష్ట్ర విభజన తర్వాత పార్టీలోకి తిరిగి వచ్చేశారు. వీరిలో చాలా మందికి తగిన గుర్తింపు దొరికిందనే చెప్పాలి. కానీ మరికొందరు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లు ఉన్నారు. వీరికి పదవులు రావడమే గగనం. వచ్చినా అవి ఎప్పుడు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్ధితి. అలాంటి కోవలో ఉన్న కొందరు నేతలకు తాజాగా ఏపీలో అధికారం కోల్పోయి పార్టీతో పాటు తాము కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్ధితుల్లో అధిష్టానం ఇస్తున్న టాస్క్లు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అయినా చంద్రబాబుకు ఎదురు చెప్పలేక వాటిని తూచా తప్పకుండా అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు.
గతంలో వర్ల, ఇప్పుడు బీటెక్ రవి...
గతంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు కృష్ణాజిల్లా పామర్రు ఎస్సీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసే అవకాశం దక్కింది. అయినా ఆయన్ను విజయం వరించలేదు. దీంతో పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు మోస్తున్న వర్ల రామయ్య వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దళిత సమస్యలపై ఆయన మాట్లాడే తీరు ఒక్కోసారి వైసీపీ నేతలను పూర్తిగా కార్నర్ చేసేలా ఉంటుంది. అటువంటి సీనియర్ నేతను ఎమ్మెల్సీగానో, రాజ్యసభ ఎంపీగానో సౌకర్యవంతంగా ఎంపిక చేసే అవకాశం టీడీపీకి ఉన్నా అలా చేయలేదు. చివరకు మెజారిటీ లేకపోయినా మొన్నటి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా ఓడిపోయే సీటు వర్లకు ఇచ్చారన్న అపప్రద మూటగట్టుకుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ బీటెక్ రవిది మరో ఆవేదన. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ఏర్పాటును విభేదిస్తూ పదవులకు రాజీనామాలు చేసేందుకు పార్టీ నేతలెవరూ ముందుకు రాకపోవడంతో బీటెక్ రవితో టీడీపీ రాజీనామా చేయించింది.
టీడీపీకి వీరే అలుసయ్యారా ?
టీడీపీలో ఎందరో సీనియర్ నేతలున్నారు. ప్రాంతాల వారీగా వ్యూహాత్మక నేతలు కూడా ఉన్నారు. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వారంతా గుర్తుకు రావడం లేదు. బాధితులు అవుతారని తెలిసి మరీ టీడీపీ అధిష్టానం వీరిని పట్టుబట్టి రంగంలోకి దింపుతోంది. దీంతో వీరు అధిష్టానం మాట కాదనలేక, అలాగని తమ భవిష్యత్ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి మరీ సై అంటున్నారు. ఉదాహరణకు రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలిసినా వర్ల రామయ్య బరిలోకి దిగేందుకు అంగీకరించారు. దాని వల్ల ఆయనకు ఎటువంటి మైలేజ్ లేకపోగా కావాలని బలిపశువుని చేశారన్న అపప్రదను సైతం పార్టీ మూటగట్టుకుంది. అయినా ఆయన పార్టీ అధిష్టానం సూచన మేరకు దళితులను వైసీపీ అవమానించిందంటూ కొత్త వాదన వినిపించారు. అలాగే ఇప్పుడు బీటెక్ రవి విషయంలోనూ పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నా జూనియర్ ఎమ్మెల్సీ అయిన ఈయనతో రాజీనామా చేయించారు. అంతగా రాయలసీమ ఎమ్మెల్సీ రాజీనామా కావాలంటే చాలా మంది ఉన్నారు. అటు ఉత్తరాంధ్ర నుంచి కూడా సీనియర్లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారిని కాదని బీటెక్ రవితో రాజీనామా చేయించడం ద్వారా భవిష్యత్ వ్యూహాలకు టీడీపీ తెరదీసిందనే వాదన వినిపిస్తోంది.
Recommended Video
ప్రజల్లోనూ చులకన భావం..
టీడీపీలో సీనియర్లుగా ఉంటూ రాజకీయ వ్యూహాల్లో భాగంగా మారుతున్న నేతలకు ప్రజల్లో ఆ మేరకు సానుభూతి లభిస్తుందా అంటే అనుమానమే. టీడీపీ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే వీరు సమిధలుగా మారుతున్నారు తప్ప ఆ నిర్ణయాలు వారి సొంత అభిప్రాయాలుగా కూడా జనం పరిగణించలేని పరిస్ధితి. దీంతో అటు రాజకీయ భవిష్యత్తును సైతం పణంగా పెట్టి టీడీపీ రాజకీయ వ్యూహాల్లో పావులుగా పనిచేస్తున్న సీనియర్ నేతలు ఇటు ప్రజల్లోనూ చులకన అవుతున్నారు. లేకపోతే ఎక్కడో రాయలసీమ ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి పక్కనే ఉన్న కర్నూలు రాజధానిగా ఇస్తానంటే కాదని అమరావతే కావాలంటూ రాజీనామా చేయడం ఏ వ్యూహాలకు నిదర్శనమని జనం ప్రశ్నించే పరిస్ధితి.