ఏపీకి పొంచివున్న మరో వాయు'గండం'
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారడంతో భారీ వర్షాలు కురిసి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఆదివారం రోజు బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 22వ తేదీకి ఇది అల్పపీడనంగామారి వాయువ్య దిశగా కదులుతుంది. అనంతరం 24వ తేదీకి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
24వ తేదీ తర్వాత విస్తారంగా వర్షాలు
దీని ప్రభావంతో 24వ తేదీ తర్వాత ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండురోజుల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శనివారం, ఆదివారం రోజుల్లో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారంరోజు శ్రీకాకుళం, అన్నమయ్య, వైఎస్సార్, గుంటూరు, ఏలూరు, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

చొచ్చుకొస్తున్న సముద్రపు నీరు
తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకొస్తోంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద అడ్డుగా ఉన్న గోడను ఇది కోసేసింది. సముద్ర జలాలు తీరంవైపు వేగంగా దూసుకువస్తుండటంతో మత్స్యకారులు, స్థానికంగా నివాసం ఉండేవారు భయాందోళనలకు లోనవుతున్నారు. వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని ఆందోళనకు లోనవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచిందని, ఎటువంటి ఆందోళనకు లోనుకావల్సిన అవసరంలేదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications