సత్యాగ్రహ పాదయాత్ర : చంద్రబాబుపై మరో పోరుకు సిద్దమైన ముద్రగడ
కిర్లంపూడి : తుని సభ.. అటు తర్వాత ఆమరణ నిరాహార దీక్ష ద్వారా కాపు ఉద్యమ సెగను ప్రభుత్వానికి తగిలేలా చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ప్రభుత్వంపై పోరుకు సిద్దమవుతున్నారు. ఈ దఫా సత్యాగ్రహ పాదయాత్ర ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు ముద్రగడ.
ఈ మేరకు నవంబర్ 16నుంచి ఐదురోజుల పాటు పాదయాత్ర చేయనున్నట్లు ముద్రగడ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో ఈ విషయాన్ని మీడియాతో తెలిపారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి ఇప్పటికీ నాన్చుడు ధోరణితోనే వ్యవహరిస్తోన్న సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా ఈ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారాయన.
అగస్టు లోగా కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇచ్చిన మాట తప్పారని ఈ సందర్బంగా ముద్రగడ మండిపడ్డారు. కాగా, పాదయాత్రలో భాగంగా.. రావులపాలెం నుంచి మొదలయ్యే సత్యాగ్రహ యాత్ర ఐదోరోజు అంతర్వేదిలో ముగుస్తుందని ముద్రగడ తెలియజేశారు. సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ.. పాదయాత్రలో నల్లరిబ్బన్లు ధరిస్తామని చెప్పుకొచ్చారు.
మొత్తానికి ముద్రగడ తాజా నిర్ణయం ద్వారా మరోసారి రాష్ట్రంలో కాపు ఉద్యమం రగలనుంది. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవడంలో ఇప్పటికే జాప్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా కాపుల పట్ల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.