గంగిరెడ్డి అనుచరులు సహా 'ఎర్ర' దొంగల అరెస్ట్: రూ.2.27 కోట్ల దుంగలు స్వాధీనం
కడప/చిత్తూరు: కడప జిల్లాలోని ముగ్గురు అంతర్జాతీయ ఎర్ర చందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం మాదవరంపోడు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున వారిని పోలీసులు అరెస్టు చేశారు.
వారు ముగ్గురు అంతర్జాతీయ ఎర్ర చందనం దొంగలుగా తెలుస్తోంది. ఇందులో ఇద్దరు గంగిరెడ్డి అనుచరులు అని సమాచారం. రూ.2.27 కోట్ల విలువైన 122 దుంగలను కడప పోలీసులు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ లడ్డూ టోకెన్ల విక్రయం
తిరుమలలో అక్రమ లడ్డూ టోకెన్ల విక్రయం సోమవారం నాడు వెలుగు చూసింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లో అక్రమంగా లడ్డూ టోకెన్లు విక్రయిస్తుండగా పలువురిని అధికారులు పట్టుకున్నారు.
దాదాపు పంతొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని టీటీడీ సూపరింటెండెంట్ మెహన్ రెడ్డి తెలిపారు. లడ్డూ టోకెన్లు బ్లాక్లో విక్రయించడం, జేబు దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వీరిని విజిలెన్స్కు అప్పగించినట్లు చెప్పారు.
కెమికల్ ఫ్యాక్టరీ ధ్వంసానికి యత్నం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చందరపడియలో ఓ కెమికల్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడుతున్నాయని, తాము ప్రమాదం బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అనంతపురం జిల్లా ముల్కనూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు హోటళ్లు దగ్ధం కాగా, రూ.8 లక్షల ఆస్తి నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా బీమడోలు హైవే పైన ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.