అమరావతిపై వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు?: హైకోర్టు అభిప్రాయం? సుదీర్ఘ విరామం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సుదీర్ఘ విరామం తరువాత మూడు రాజధానుల అంశంపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటన చేసిన తరువాత తలెత్తిన న్యాయపరమైన ఇబ్బందుల నేపథ్యంలో ఆయన ఈ అంశంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. పలితంగా- మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారంలో జాప్యం నెలకొంటూ వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులు ఏర్పడటంతో ఈ జాప్యం మరింత పెరిగింది. హస్తినకు వెళ్లినప్పుడు కేంద్ర ప్రభుత్వం సమక్షంలో ఈ డిమాండ్ను వినిపించడం మినహా పూర్తిస్థాయిలో దీనిపై కసరత్తు చేయలేదాయన.
Recommended Video
ఎన్నికల వేళ..సరికొత్త ఈక్వేషన్లు: శశికళ రీఎంట్రీ: చెన్నైకి ప్రయాణం: వాట్ నెక్స్ట్?
కాస్సేపట్లో సమగ్ర సమీక్ష..
ఈ పరిస్థితుల మధ్య- వైఎస్ జగన్.. అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ) మీద సమీక్ష నిర్వహించబోతోన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతోన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడంపై పూర్తిస్థాయిలో ఓ సమగ్ర సమీక్షను నిర్వహించబోతోండటం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ఫలితంగా అందరి దృష్టీ దాని మీదే నిలిచింది.
ఏక రాజధానిపై విముఖత..
మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చిన తరువాత.. అమరావతిలో అభివృద్ధి పనులు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో అరకొరగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయే తప్ప.. చంద్రబాబు ప్రభుత్వ చివరి నెలల్లో కొనసాగినంత వేగం కనిపించట్లేదు. అమరావతిపై జగన్ సర్కార్కు పెద్దగా ఆసక్తి లేకపోవడమే దీనికి కారణమనేది బహిరంగ రహస్యమే. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించడం వైపు జగన్ ముందు నుంచీ అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒకే రాజధాని ఉండటం వల్ల హైదరాబాద్ తరహా పరిస్థితులు ఉత్పన్నమౌతాయని ఆయన భావిస్తున్నారు.
మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసమే..
మూడు రాజధానులను తీసుకుని రావడం వల్ల మూడు ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు. దీనికి అనుగుణంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలోని ప్రధాన నగరం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందనే కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు.
జగన్ ఏం చెబుతారు?
ఈ పరిణామాల మధ్య ఏఎంఆర్డీఏపై వైఎస్ జగన్ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించడం, ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు? ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేలా నిర్ణయాలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఈ సారి డెడ్లైన్ పెట్టొచ్చని అంటున్నారు. హైకోర్టు అభిప్రాయాన్ని తీసుకుని దాన్ని తరలించ వచ్చంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన చేయడంతో.. ఈ దిశగా ఆయన చర్యలు ఉంటాయని అంటున్నారు.