తిరుమల దగ్గరలో మంటలు: ముందే నాసా హెచ్చరిక?
చిత్తూరు: ఏడుకొండల్లో దావానలం నేపథ్యంలో తిరుమల సమీపానికి మంటలు వ్యాపిస్తున్నాయి. శ్రీవారి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే మంటలు ఉన్నాయి. కాకులకోన దగ్ధమైంది. కార్చిచ్చు కారణంగా పాపవినాశనం మార్గం మూసివేశారు. నడకరదారిలో భక్తుల రాకను నిలిపివేశారు. ఘటనపై గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించారు. సైనిక హెలికాప్టర్ల సాయం కోరారు. గురువారం సైనికులు రంగంలోకి దిగనున్నారు.
మంటలను అదుపు చేయడానికి టిటిడి, అటవీ, ఆరోగ్య, ఇంజనీరింగ్, పోలీసు శాఖలకు చెందిన 500 మంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. మంగళవారం మధ్యాహ్నం మొదలైన ఈ మంటలు బుధవారానికీ తగ్గకపోవడం శ్రీవారి ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో అగ్నిజ్వాలలు చెలరేగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కార్చిచ్చు ధాటికి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరువందల హెక్టార్లలో అటవీ సంపద బుగ్గిపాలై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మంటల్లో కాకులమాను కొండపై ఏర్పాటు చేసిన పవన విద్యుత్ మరలలో రెండు పూర్తిగా, ఒకటి పాక్షికంగా పాడయ్యాయి. దీంతో రూ.90 లక్షల నష్టం వాటిల్లింది. ముందు జాగ్రత్తగా మిగిలిన గాలిమరలను కూడా ఆపేయడంతో దాదాపు 4 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుమలలోని బాలాజీ నగర్లో ఉన్న స్థానికుల గృహాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా సాయంత్రం 6 గంటలకు సరఫరా పునరుద్ధరించారు.
మంటలను అదుపు చేసేందుకు టిటిడిపి ఈవో గోపాల్ ఆదేశాల జారీ చేశారు. దీంతో తిరుమల భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. కాకులకోన, పార్వేట మండపం ప్రాంతాలలో వేగంగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పేందుకు ప్రత్యేక వాహనాల్లో నీటిని తీసుకెళ్లారు. శేషాచల అడవుల్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం. శేషాచల అడవుల్లో కార్చిచ్చును అదుపుచేయడానికి వెళ్లిన సిబ్బంది ఉధృతంగా ముందుకువస్తున్న మంటలను చూసి భయపడి పరుగులు తీశారు.
ఒక దశలో పవన విద్యుత్ ఉత్పాదన కేంద్రం వద్ద సిబ్బంది, మీడియా ప్రతినిధులను మంటలు చుట్టుముట్టడడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఒకవైపు మంటలను అదుపుచేసుకుంటూ బయటపడి ఊపిరిపీల్చుకున్నారు. మంటలను అదుపు చేయడానికి 150 మంది పోలీసులతో కొన్ని బృందాలను ఏర్పాటుచేసినట్టు తిరుపతి పోలీసులు తెలిపారు. రిజర్వు అటవీశాఖ, టిటిడి సెక్యూరిటీ, టిటిడి అటవీ శాఖ సిబ్బందిలను కూడా రప్పించి 8 బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు.
వీరందరూ అడవుల్లోకి ప్రవేశించి తొలుత అడుగు భాగాన ఉన్న మంటలను అదుపుచేస్తారన్నారు. శేషాచల కొండల్లో మంటల విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ రాంగోపాల్ తెలిపారు. తిరుమల క్షేత్రానికి ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. 20 మంది నావికాదళ సిబ్బంది తిరుమలకు చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో హెలికాప్టర్ల సాయం కోసం విశాఖ కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్తో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ అగ్నిప్రమాదంతో భక్తులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, వారు భయపడాల్సిన పని లేదని ఈవో గోపాల్ పేర్కొన్నారు. శేషాచల అడవుల్లో మంటల కారణంగా పాపవినాశానికి వాహనాల రాకపోకలను నిలిపేశారు. పాపవినాశనం నుంచి భక్తులను ప్రత్యేక బస్సుల ద్వారా తిరుమలకు తరలించారు. అక్కడున్న (పాపవినాశం) వ్యాపార దుకాణాలను కూడా మూయించి వారిని తిరుమలకు పంపించేశారు.
2నే నాసా హెచ్చరిక
తిరుమల అడవుల్లో మంటలు ఈ నెల రెండునే మొదలయ్యాయా? రాష్ట్ర పర్యావరణ శాఖ అధికారులు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమిస్తున్నారు. ఈ మేరకు మార్చి 2నే నాసా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హెచ్చరించిందని, అధికారులకు పంపిన సెల్ఫోన్ సందేశాలను సైతం పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
అగ్ని కీలల్లో... మూగజీవాలు
శేషాచల కొండల్లో అగ్ని కీలల ధాటికి మూగజీవాలు సజీవ దహనమైపోతున్నాయి. పాపవినాశం, కాకులకోన, పార్వేటి మండపం, మంగళం వద్ద గల ఎల్ఐసి శిక్షణ కేంద్రం పైభాగాన ఉన్న కొండ ప్రాంతాల్లో పచ్చని చెట్లు మాడిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చిరుత పులులు, దుప్పులు, జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, రేసు కుక్కలు, అడవికోళ్లు, పునుగుపిల్లి, అరుదైన పక్షి జాతులు ఉంటున్నాయి. పాపవినాశం పరిసర ప్రాంతాల్లో అరుదైన బంగారు బల్లి సంచరిస్తోంది.
తప్పించుకోగల జంతువులు, ఎగిరిపోగల పక్షులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డా, మిగిలిన చిన్న చిన్న ప్రాణులన్నీ ఆహుతైపోయాయి. సుదూర ప్రాంతాలకు పారిపోయిన శాకాహార జంతువులు తిరిగి ఇక్కడకు రావాలంటే చాలా సమయం పట్టనుంది. అనువైన ప్రాంతం దొరికే వరకు అవి సురక్షితంగా ఉండటమూ కష్టమే. శేషాచలం కొండల్లో అరుదైన మొక్కలు, వనమూలికలు, ఎర్రచందనం, పెర్రీత తదితర చెట్లున్నాయి, ఇవన్నీ కూడా బూడిద కుప్పలుగా మారుతుండటం విచారకరం.