తిరుమల శ్రీవారికి భారీ ఆదాయం.. ఎన్ని కోట్లో తెలుసా..?
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వామివారికి భక్తులు కానుకల రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. సాధారణ రోజుల్లోనే తిరుమలకు భక్తులు పోటెత్తుంటారు. ఇక, పండుగలు, ఉత్సవాలు, విశేష రోజుల్లో ఇక్కడ రద్దీగురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న(ఆదివారం) వీకెండ్ కావడంతో భారీ ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు.
రూ.3.16కోట్ల ఆదాయం..
నిన్న ఒక్కరోజే సుమారు 75,147మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో 28,096 మంది భక్తులు శ్రీవారికి మొక్కుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఇకపోతే శ్రీవారి హుండీ ఆదాయం లెక్కించారు. రూ.3.16కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

భక్తుల రద్దీ..
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం ప్రస్తుతం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 10గంటల సమయం పడుతున్నట్లు ఆధికారులు తెలిపారు. నేడు (సోమవారం) తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 3 గంటల వరకు సుప్రభాత సేవ జరగనున్నట్లు తెలిపారు. నేటి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4 వరకు తోమల సేవ కార్యక్రమం ఉంటుంది. దీంతోపాటు 4 గంటల నుంచి 4.15 వరకు కొలువు మరిచు పంచాంగ శ్రవణం జరగనున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి నెల కోటా..
ఫిబ్రవరి నెల 2025 కోటాకు సంబంధించి శ్రీవారి దర్శనాలు, వసతి గదులు, ఆర్జిత సేవ టికెట్లను నేడు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నేడు (సోమవారం) రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెల గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు టీటీడీ అధికారిక https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ సంప్రదిగలరు.












Click it and Unblock the Notifications