బంద్ విజయవంతం: ఇది శాంపిల్ మాత్రమేనన్న హీరో శివాజీ
అమరావతి: ఏపీకి ప్రత్కేకహోదా కోరుతూ మంగళవారం జరిగిన బంద్ ఓ శాంపిల్ మాత్రమేనని సినీ నటుడు, ఏపీ ప్రత్యేకహోదా సాధనసమితి లీడర్ శివాజీ తెలిపారు. బంద్పై శివాజీ మాట్లాడుతూ ఒక్క రోజు బంద్ నిర్వహించి కేంద్రానికి హెచ్చరికలు పంపారని ఆయన అన్నారు.
బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని ఆయన అన్నారు. ప్రజలంతా కలిస్తే ఏపీలో ఎలా ఉంటుందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలంతా రోడ్ల మీదికి వస్తే ఎలా ఉంటుందో కేంద్రానికి అర్ధమయ్యేలా చేయగలిగామని ఆయన తెలిపారు.
బుధవారం జీఎస్టీ బిల్లుకు మద్దతు ప్రకటించకపోవడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలని ఆయన ఎంపీలను కోరారు. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విపక్షం వైసీపీతో పాటు వామపక్షాలు నిర్వహించిన సమ్మె విజయవంతమైంది.
వైసీపీ ఇచ్చిన బంద్కు పిలుపునివ్వడంతో కాంగ్రెస్, వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి. బంద్ వల్ల ప్రైవేటు వాహనాలు ఎక్కడివి అక్కడే ఆగిపోగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. సినిమా థియేటర్లన్నీ తమ తమ ప్రదర్శలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించాయి.