Tollywood: సీఎం జగన్ చుట్టూ టాలీవుడ్ రాజకీయం..స్క్రిప్టింగ్ జరుగుతోందా..?
tollywood:తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్య దూరం పెరుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఎవరూ చర్యలు తీసుకోవడంలేదు. టికెట్ ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలు రద్దుచేయడంతోపాటు థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించడంవంటివన్నీ కలిసి దూరానికి కారణమయ్యాయి. టికెట్ల ధరలు పెంచుకుంటామంటూ చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ప్రభాస్ లాంటివారు వచ్చి ముఖ్యమంత్రికి విన్నవించుకుంటే కథానాయకుడి స్థాయిని బట్టి, సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చారు.

థియేటర్లకు రావడం మానేసిన ప్రేక్షకులు
పెరిగిన ధరలు చూసిన ప్రజలు థియేటర్లకు రావడమే మానేశారు. అసలుకే మోసం రావడంతో సినీ పెద్దలంతా తమ సినిమా విడుదలయ్యే సమయంలో ధరలు తక్కువ.. పాత ధరలనే అమలు చేస్తున్నామంటూ ప్రకటనలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలను నిలువరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందటూ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు విమర్శలు ఎక్కుపెట్టాయి.

హైదరాబాద్ నుంచి వైజాగ్ కు మారుద్దామని..
వాస్తవానికి తెలుగు సినీ పరిశ్రమ కేంద్రంగా హైదరాబాద్ ఉన్నప్పటికీ దాన్ని విశాఖపట్నానికి మార్చాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో సినీ ప్రముఖులతో చర్చలు కూడా జరిపారుకానీ టికెట్ల ధరల వివాదం దూరం పెంచింది. వైసీపీకి పేరున్న నటులెవరూ మద్దతివ్వడంలేదు. మోహన్ బాబు మద్దతిచ్చినా ఇప్పుడు ఆయన సైలెంటయ్యారు. జయసుధ, జీవిత రాజశేఖర్, ప్రథ్వీలాంటివారు తప్పుకున్నారు. పోసాని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అవగా, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమితులయ్యారు.

స్టూడియోలో తరుచుగా సమావేశాలు
తాజాగా కొందరు సినీ ప్రముఖులు ఒక ప్రముఖ నిర్మాతకు సంబంధించిన స్టూడియోలో తరుచూ సమావేశమవుతున్నారు. ఏపీలో పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారులు కూడా వీరికి జతవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే అంశంపైనే చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి ముఖ్యమంత్రి అవకుండా తామేం చేయాలి అనేదానిపై వారంతా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications