ప్రచారంలో టీని వేడెక్కించిన హేమాహేమీలు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో ప్రచార పర్వానికి తెర పడింది. ఈ నెల 30వ తేదీన తెలంగాణ ప్రజలు లోకసభ, శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ప్రచారం వాడివేడిగా సాగింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన హేమాహేమీలు తెలంగాణలో పర్యటించారు. చివరి రోజుల్లో ప్రచారం ఉధృతంగా సాగింది. రాజకీయ నాయకులు సుడిగాలి పర్యటనలు చేశారు.
తెలంగాణ ఇచ్చిందెవరు, తెచ్చిందెవరు అనే విషయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు పార్టీలు ప్రధానాంశం చేసుకోగా, రాష్ట్ర విభజన తీరును బిజెపి ప్రధాని అభ్యర్థి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎండగట్టే ప్రయత్నం చేశారు. విభజనపై నరేంద్ర మోడీ కాంగ్రెసు పార్టీని లక్ష్యం చేసుకుంటే, పవన్ కళ్యాణ్ కాంగ్రెసునే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కూడా లక్ష్యం చేసుకున్నారు.
తెలంగాణ భవిష్యత్తు కోసం తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామంటూ చెప్పిన కెసిఆర్ కాంగ్రెసు పార్టీనే కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా దుయ్యబట్టారు. చివరి రోజుల్లో పవన్ కళ్యాణ్కు, కెసిఆర్కు మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ప్రచార ఘట్టాన్ని వేడెక్కించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కెసిఆర్ను లక్ష్యం చేసుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తెలంగాణకు వచ్చి కాంగ్రెసుకు ప్రచారం చేశారు.

నరేంద్ర మోడీ...
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒక్క రోజులో తెలంగాణలో నాలుగు ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెసును ఆయన దుమ్మెత్తి పోశారు.

సోనియా గాంధీ..
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండు సార్లు తెలంగాణకు వచ్చారు. మొదటిసారి కాస్తా మెత్తగా మాట్లాడిన సోనియా రెండోసారి వచ్చినప్పుడు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ...
తెలంగాణలో రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆయన కెసిఆర్ను వెన్నుపోటు దారుడిగా అభివర్ణించారు.

చంద్రబాబు నాయుడు...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చివరి ఘట్టంలో సుడిగాలి పర్యటనలు చేశారు. కెసిఆర్ను ఉరికిస్తామని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్..
అనూహ్యంగా జనసేన పార్టీని స్థాపించి టిడిపి, బిజెపిలకు మద్దతుగా హీరో పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి దిగారు. కెసిఆర్పై, తెరాస నాయకుడు హరీష్ రావుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

కె. చంద్రశేఖర రావు
తెలంగాణలో విజయమే లక్ష్యంగా ఒంటరిపోరుకు దిగిన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు నాయకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

సుష్మా స్వరాజ్...
బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా తెలంగాణలో ప్రచారం సాగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ పార్టీ నిర్వహించిన పాత్రను ఆమె వివరించారు.

వైయస్ జగన్..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఖమ్మం జిల్లాలోనూ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆయన ప్రచారం సాగించారు.

వైయస్ షర్మిల కూడా..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల కూడా తెలంగాణలో రోడ్ షోలు నిర్వహించారు.

నారా లోకేష్ కూడా..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కూడా తెలంగాణలో ప్రచారం సాగించారు. టిడిపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

జయప్రద స్నేహితురాలి కోసం...
తన సహనటి, తన మిత్రురాలు జయసుధ కోసం రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్లలో పోటీ చేసిన జయప్రద కూడా ప్రచారానికి వచ్చారు.












Click it and Unblock the Notifications