ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు- కుండపోతతో నెల్లూరు జలమయం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ద్రోణి కారణంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, అనంతపురం, కర్నూలులోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
పలు జిల్లాల్లో ఉదయం నుంచీ భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇందులో నెల్లూరులో అత్యధికంగా ఇవాళ కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు జలదిగ్భందంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన స్ధానికులు ప్రయాణికులను సురక్షితంగా బయటికి తెచ్చారు. ఇతర దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.
Recommended Video


గోదావరి జిల్లాల్లోనూ ఉదయం నుంచి నిరంతరంగా వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు జల్లులు పడుతున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ద్రోణి ప్రభావం ఎక్కువైతే రేపు కూడా వర్షాలు తప్పవని వాతావరణ విభాగం చెబుతోంది.












Click it and Unblock the Notifications