బాబుదే ఈ పాపం, కలిసుందాంటూ: ఏకిపారేసిన తెరాస
హైదరాబాద్: నాలుగువేల మెగావాట్ల విద్యుత్ లోటుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, మిగులు విద్యుత్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఈ అంశాన్ని మరుగునపరిచి తెలుగుదేశం పార్టీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, విద్యుత్ పాపం చంద్రబాబుదేనని తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మంగళవారం విమర్శించారు. ఉద్దేశ పూర్వకంగానే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకులు విద్యుత్ రంగంలో నిర్లక్ష్యం చేశారన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
వలస పాలనలో విద్యుత్ రంగంలో తెలంగాణను అన్యాయం చేయడం వల్ల కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడేళ్లపాటు విద్యుత్ సమస్య తప్పదని ఎన్నికలకు ముందే తెరాస ప్రకటించిందని గుర్తు చేశారు. రైతులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు పిపిఎలను రద్దు చేస్తున్నప్పుడు బాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎన్నికల ప్రణాళికలో సైతం మూడేళ్ల పాటు విద్యుత్ సమస్య ఉంటుందని ప్రజలకు వాస్తవాలే చెప్పామన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. అమలుకు సాధ్యమైన హామీలను మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు. విద్యుత్ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేస్తూ విద్యుత్ రంగంలో తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం పాపం చంద్రబాబుదే నని అన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీని మించిన వారు లేరన్నారు.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు తగ్గించాలని రైతులు ఆందోళన చేస్తే బషీర్బాగ్ చౌరస్తా వద్ద రైతులపై కాల్పులు జరిపి హత్య చేశారని, ఇప్పుడు వాళ్లు రైతుల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు.
తెలంగాణకు ద్రోహం చేస్తున్న పార్టీ వారిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ విశ్వసించరన్నారు. టిడిపి నాయకులకు కేసిఆర్ను విమర్శించే నైతిక హక్కులేదన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే కేసిఆర్ ఉన్నారన్నారు. ఒకవైపు అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని చెబుతున్న బాబు, మరోవైపు తెలంగాణలో తన అనుచరుల ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు.