ఆశించిన ఫలితాలే, 28రాష్ట్రాలకు భిన్నంగా మేం: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో తాము ఆశించిన ఫలితాలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత ఈటెల రాజేందర్ బుధవారం అన్నారు. మే 16న ఫలితాలు తమ వైపే ఉంటాయన్నారు. 80 శాతం మంది మాజీ మంత్రులు మట్టి కరవడం ఖాయమన్నారు. స్థానిక పోరులో తెలంగాణ ఆత్మ ఆవిష్కృతమైందన్నారు.
అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తమకు వచ్చిన ఫలితాలు ప్రత్యర్థులకు చెంపపెట్టు అన్నారు. తెలంగాణలో తెరాస గెలువబోతుందన్నారు. ప్రజలు ఆశించినట్లు తెలంగాణ నిర్మాణం కాబోతుందన్నారు. తమది కేవలం ఉద్యమ పార్టీ లేక రాజకీయ శక్తి మాత్రమే కాదని ప్రజల సమస్యలపై స్పందించే పార్టీ అన్నారు.
మే 16న ఫలితాల తర్వాత అసెంబ్లీ మీద ఎగురబోయే జెండా తెరాసదే అన్నారు. తాము 70 నుండి 80 స్థానాలు గెలుచుకుంటామని చెప్పారు. తమ పార్టీ ప్రజల సమస్యల పైన స్పందిస్తుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తాము ముందుంటామని చెప్పారు.

ఆకలి కేకలు లేని సుసంపన్నమైన తెలంగాణ కావాలన్నారు. తెరాస ఆశ, శ్వాస తమ ప్రాంత ప్రజల గురించే అన్నారు. తెలంగాణ వచ్చాక రాజకీయ దోపిడీ ఉండదని చెప్పారు. తెరాస ప్రజలను ప్రలోభాలకు గురి చేయదన్నారు. వాటి పైన తమకు నమ్మకం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నట్లు తెరాస గెలుస్తుందన్నారు.
స్థానిక ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో తాము పోటీ చేయలేదని చెప్పారు. ప్రజామోదం పొందేలా తమ పని తీరు ఉంటుందన్నారు. 28 రాష్ట్రాలకు భిన్నంగా తమ అజెండా ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తామన్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలు తమవేనని మరో నేత హరీష్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications