టీటీడీలో కారుణ్య నియామకాలు, ఇళ్ల స్థలాలపై కమిటీ?
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 84,258 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 33,502 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.90 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు కూడా క్రిక్కిరిసిపోయాయి. అదనంగా షెడ్లను వేయాల్సి వచ్చింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది.
తిరుమలకు పోటెత్తే వేలాదిమంది భక్తులకు ఎటువంటి జాప్యం లేకుండా సేవలను అందిస్తోన్న ఉద్యోగుల సంక్షేమంపై టీటీడీ దృష్టి సారించింది. వారు ఎదుర్కొంటోన్న సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. టీటీడీ పరిధిలోని ఉద్యోగుల సమస్యలను నిర్దేశించిన సమయంలో.. అలాగే ప్రభుత్వ పరిధిలోని అంశాలపై వారితో చర్చించి అనుమతులు తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ఫండ్ కేటాయింపులోను, ఇతర అలవెన్స్ ల చెల్లింపులోను అలసత్వం లేకుండా పరిష్కరించాలని కోరారు.
నిబంధనల ప్రకారం పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని శ్యామలరావు అన్నారు. జీఎన్బీ, ఎస్వీ పూర్ హోమ్, కే.టీ, వినాయకనగర్, రామ్ నగర్ ప్రాంతాలలోని టీటీడీ క్వార్టర్స్ లలో డ్రైనేజీ సమస్యలు, భవనాల లీకేజీలు, విద్యుత్ తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే కేటాయించిన ఇళ్ల స్థలాలపై వివిధ శాఖల అనుమతుల విషయంలో సీనియర్ అధికారులతో కమిటీ వేసుకుని పరిష్కరించాలని సూచించారు. దిగువ స్థాయిలో ఉద్యోగుల సమస్యలపై నిరంతరం సీనియర్ అధికారులు చర్చించి పరిష్కరించాలని, ప్రభుత్వ స్థాయిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఈవో కోరారు.












Click it and Unblock the Notifications