వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఉత్సవాలు జరిగే టీటీడీ స్థానిక ఆలయాలు ఇవే..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 69,630 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,183 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.13 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టింది.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాల్లోనూ విస్తృతంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లను వేస్తోన్నారు. రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరిస్తోన్నారు.
అన్నమయ్య రాయచోటి జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం మొదలవుతుంది. ఉదయం 8:30 గంటలకు లక్ష తులసీ అర్చన నిర్వహిస్తారు.
జనవరి 11వ తేదీన వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8:45 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 13వ తేదీన గోదా కల్యాణం, 15న పార్వేట ఉత్సవాలు ఈ ఆలయంలో జరుగనున్నాయి. చిత్తూరు జిల్లా సోమలలోని ఆవులపల్లి శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా తెల్లవారు జామున 3 నుండి 3:30 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. 5 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 7 నుండి 10:30 గంటల వరకు స్వామివారిని తిరుచ్చిపై ఊరేగిస్తారు.
చిత్తూరు జిల్లా సదుం మండలం బొర్రగమంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలుపుతారు. ధనుర్మాస కైంకర్యాలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం, 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామోత్సవం జరుగనుంది.
అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిల్లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోన్నారు టీటీడీ అధికారులు.












Click it and Unblock the Notifications