TTD: వృద్ధులు, దివ్యాంగుల కోటా దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ..
వృద్ధులు, దివ్యాంగుల కోటా దర్శన టికెట్లను టీటీడీ ఈ రోజు విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లు ఇవాళ ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో పెట్టింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.
టికెట్ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఆన్లైన్ ద్వారా ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చని పేర్కొంది. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
సోమవారం తిరుమల శ్రీవారిని 71434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చినట్టు పేర్కొంది. నిన్న స్వామివారికి 24212 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు.