TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.
శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది.

ఆ తరువాత రాత్రి 9 గంటల నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ఏప్రిల్ 18వ తేదీన రాత్రి 8 గంటల నుండి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీరామనవమి వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలకు మామూలుగా వచ్చే భక్తుల కంటే శ్రీరామనవమి రోజున భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా తిరుమలలో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కడుతున్నారు. గురువారం తిరుమలలో65, 992 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25, 698 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ 3. 53 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications