TTD: శ్రీవారి భక్తులకు భారీ రిలీఫ్, గదుల అద్దెలు తగ్గింపు - ఇక నో వెయిటింగ్..!!
Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రిలీఫ్ ఇచ్చేలా ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు జీఎస్టీ తగ్గింపు స్లాబ్స్ అమల్లోకి వచ్చాయి. టీటీడీ సైతం భక్తుల నుంచి గదుల అద్దెగా వసూలు చేసే మొత్తం పైన జీఎస్టీని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా భక్తుల గదుల అద్దెలు తగ్గనున్నాయి. అదే సమయంలో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ సమయాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక నుంచి వెయిటింగ్ లేకుండా గదుల కేటాయింపు పైన టీటీడీ కసరత్తు చేస్తోంది.
తిరుమలకు వచ్చే భక్తులకు గదుల విషయంలో ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గదుల కోసం సేకరించే అద్దెల పైన జీఎస్టీని తగ్గిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం సేవలపై జీఎస్టీని తగ్గించింది.. దీనికి అనుగుణంగా తిరుమలలో అద్దె గదులపై పన్నును తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఫైల్ను ఆమోదించామని ఈవో చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో భక్తులు చెల్లించే అద్దెలు తగ్గనున్నాయి. మూడు నెలల ముందు శ్రీవారి సేవలు, దర్శన టికెట్ల జారీ విధానాన్ని పునఃపరిశీలించాలని నిర్ణయించామని చెప్పారు. గదుల విషయంలో భక్తుల నుంచి ఎక్కువగా వస్తున్న అభ్యర్ధనల మేరకు సాధ్యమైనంత వరకు వెయిటింగ్ లేకుండా కేటాయింపులు...ముందస్తు రిజర్వేషన్లలో మార్పుల దిశగా టీటీడీ కసరత్తు ప్రారంభించింది.

ఇక, తాజాగా భక్తుల కోసం తిరుమలలో వెంకటాద్రి వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తిరుమలలో 45 వేలమందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయి. కొత్తగా నిర్మించిన పీఏసీ-5లో 2,500 మంది యాత్రికులు సులభంగా వసతి పొందవచ్చు. తిరుమల బ్రహ్మోత్సవాల వేళ సీఎం చంద్రబాబు ఈ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ భవనంలో అనేక ఆధునిక వసతులు కల్పించారు. 2,500 మందికి వసతి సౌకర్యం కల్పించినప్పటికీ, అవసరమైతే మరో 1,000 మంది యాత్రికులను కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్ ఫీడింగ్ గది ఏర్పాటు చేశారు. ఒకేసారి 1,400 మంది అన్న ప్రసాదాలు స్వీకరించే విధంగా విస్తృతమైన అన్నప్రసాదాల హాలు ఉంది. ప్రథమ చికిత్స కేంద్రం, కళ్యాణకట్ట, అన్న ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అవసరమైన సదుపాయాలను ఈ భవనంలో కల్పించారు.












Click it and Unblock the Notifications