TTD: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అనూహ్య నిర్ణయం..భద్రతా కవచం..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బ్రహ్మోత్సవాలు.. వరుస సెలవులతో పెరిగిన రద్దీ క్రమేణా తగ్గుతోంది. ఇటు భక్తుల సేవల కోసం టీటీడీ సాంకేతికత వినియోగం పైన ఫోకస్ చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలోనూ ఇస్రో సేవలను వినియోగించింది. అదే విధంగా ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా భక్తుల దర్శనం వేగంగా జరిగేలా కసరత్తు జరుగుతోంది. కాగా, ఈ సమయంలోనే టీటీడీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఘాట్ రోడ్లలో ఎలాంటి భయం లేకుండా భద్రతా కవచం ఏర్పాటుకు నిర్ణయించింది.
టీటీడీ భక్తులకు భద్రత కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పర్వత మార్గాల్లో కొన్ని సందర్భాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. కొండ చరియలు జారిపడటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు పెద్ద పెద్ద రాళ్లు రహదారిపై పడటంతో వాహన రాకపోకలు అంతరాయం కలిగాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. అందులో భాగంగా ఘాట్ రోడ్లలో 'రాక్ బోల్టింగ్', 'రాక్ ఫెన్సింగ్' విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడకుండా నిరోధించవచ్చు.

ఈ తరహా ఆధునిక ఇంజినీరింగ్ పద్ధతి అమలుకు నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో పెద్ద .. కొండగోడలలో ఉక్కు బోల్టులు బిగించి వాటిని కాంక్రీటుతో బలపరుస్తారు. ఆపై వాటి చుట్టూ ఇనుప వలలు వేస్తారు. ఈ విధానం వలన కొండలోని రాళ్లు కదలకుండా పటిష్ఠంగా ఉంటాయి. తిరుమల ఘాట్ రోడ్లలో ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా, వర్షాల సమయంలో రాళ్లు జారిపడే ప్రమాదాలు గణనీయంగా తగ్గనున్నాయి.
ఈ ప్రాజెక్టుపై టీటీడీ ఐఐటీ మద్రాస్ సహా ఇతర సంస్థల నిపుణులను సంప్రదించారు. వీరు ఘాట్ రోడ్లలోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, అక్కడ తగిన రాక్ బోల్టింగ్ విధానాన్ని సూచించారు. అక్కడ రాళ్ల స్థితి, మట్టిరకం, వర్షపాతం, రహదారి ఎత్తు వంటి అంశాలను పరిశీలించి తగిన బోల్టింగ్ డిజైన్ అమలు చేస్తున్నారు.
అదే సమయంలో ఒక చెట్టుకూడా తొలగించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమల అడవుల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేలా, రాళ్ల చుట్టూ మాత్రమే నిర్మాణం జరుగుతోంది. కొండ బోల్టింగ్తో పాటు రాక్ ఫెన్సింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పర్వతాల పైన ఉన్న చిన్న రాళ్లు కిందకు జారిపోకుండా అడ్డుకుంటుంది. ఫెన్సింగ్ కోసం అధిక బలమున్న మెష్ నెట్లు ఉపయోగిస్తున్నారు. వర్షాకాలంలో ఈ రాక్ బోల్టింగ్ వ్యవస్థ ప్రాణ రక్షక కవచంలా ఉంటుంది. ప్రస్తుతం మొదటి దశగా పలు ప్రాంతాల్లో పనులు పూర్తిచేశారు. రెండో దశలో మిగిలిన ప్రాంతాల్లో కూడా అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications