తిరుమలలో భక్తులు ఎదుర్కొంటోన్న దీర్ఘకాల సమస్యకు చెక్ పెడుతున్న టీటీడీ
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 65,112 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,331 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- శ్రీవారి దర్శనం టికెట్లు, వసతిగదులు, ఇతర ఆర్జిత సేవల టికెట్ల బుకింగ్ లో ఆన్ లైన్ మోసాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది టీటీడీ. దీనికోసం ప్రత్యేకంగా తిరుమల కొండపై సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. ఆన్లైన్ మోసాలను ఎదుర్కొని భక్తులను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.
నకిలీ దర్శన టిక్కెట్లు, శ్రీవారి సేవ, దాతల పాస్లు, వసతి గదులు, లడ్డూ ప్రసాదం పేరుతో పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. తాము టీటీడీ అధికారులమని చెప్పుకుంటూ భక్తులను మోసగించిన కేసులు కూడా గతంలో అనేకం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నకిలీ ఖాతాలను సృష్టించడం, అంతర్గతంగా సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేయడం.. వంటి అంశాలు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించింది. ఈ క్రమంలో- బుకింగ్ సిస్టమ్స్, యాప్లు, పోర్టల్స్ ద్వారా సేకరించిన భక్తుల వ్యక్తిగత, ఆర్థిక, బయోమెట్రిక్ డేటాను రక్షించడం అత్యంత ప్రాధాన్యతగా మారిందని భావిస్తోంది.
దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను పాలక మండలికీ అందజేశారు.ఆన్ లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడం, భక్తుల వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ఇతర సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేకంగా ఓ ఇన్ హౌస్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ఏర్పాటు చేయాల్సిన ఆవసరం ఉందని.. విజిలెన్స్ విభాగం తన నివేదికలో పొందుపరిచింది.
ఈ ప్రతిపాదనను ట్రస్ట్ బోర్డు ఆమోదించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పోలీసుల సహకారంతో టీటీడీ విజిలెన్స్, ఐటీ విభాగాలు ఈ సదుపాయం కోసం కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. మోసాలను తక్షణమే గుర్తించడానికి అవసరమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇతర ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఈ ల్యాబ్ లో ఉంటాయి.












Click it and Unblock the Notifications